
హైదరాబాద్/మల్కాజిగిరి/ వికారాబాద్, వెలుగు: స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో నిర్వహించిన ముగ్గుల పోటీలను అడిషనల్ కమిషనర్ శృతి ఓజా ప్రారంభించారు. సీనియర్ సివిల్ జడ్జి, మెట్రోపాలిటీ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ రాధికా జైస్వాల్, సీబీఐ కోర్టు జడ్జి సూర శ్రీనివాస్ రెడ్డి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. రాధికా జైస్వాల్ మాట్లాడుతూ.. మన సంస్కృతి, సాంప్రదాయాలు, దేశభక్తి, జై జవాన్ .. జై కిసాన్ కాన్సెప్ట్లతో బల్దియా మహిళా ఎంప్లాయీస్, స్వయం సహాయక సంఘాల మహిళలు ఆకట్టుకునేలా ముగ్గులు వేశారన్నారు.
హెడ్డాఫీసులోని ఎలక్ట్రిక్ వింగ్లో పనిచేస్తున్న సంగీత, శృతి ఫస్ట్ ప్రైజ్ గెలుపొందగా.. మలక్ పేట్ సర్కిల్ మహిళా గ్రూప్ సభ్యులు అరుణ, గోదావరి, సోనీకి సెకండ్ ప్రైజ్, కార్వాన్ సర్కిల్ పీడబ్ల్యూడీ గ్రూప్ సభ్యులు రమాదేవి, కార్తీకకు థర్డ్ ప్రైజ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. నేరెడ్ మెట్ పీఎస్ పరిధిలోనూ మహిళా సిబ్బందికి రంగవల్లుల పోటీలను నిర్వహించారు. వికారాబాద్ పట్టణంలోని బ్లాక్ గ్రౌండ్స్ మైదానంలో రంగోళి పోటీలను నిర్వహించగా.. విజేతలకు కలెక్టర్ నిఖిల, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, ఎంపీపీ చంద్రకళ ప్రైజ్లను అందజేశారు.