
రైడ్ హెయిలింగ్ వ్యాపారంలో సంచలనాలు సృష్టించిన ర్యాపిడో ప్రస్తుతం మరో ప్రభంజనం సృష్టించటానికి సిద్ధం అవుతోంది. కంపెనీ త్వరలోనే ఫుడ్ డెలివరీ వ్యాపారంలోకి కూడా అండుగుపెట్టాలని చూస్తున్నందున ఆ రంగంలోని స్విగ్గీ, జొమాటో కంపెనీ షేర్లు భారీ పతనాన్ని చూస్తున్నాయి. మెుదట కేవలం టూవీలర్లతో రైడ్ హెయిలింగ్ ప్రారంభించిన ర్యాపిడో అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టడం గమనార్హం.
ర్యాపిడో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని రెస్టారెంట్లను ఫుడ్ డెలివరీ కోసం తమ ఫ్లాట్ ఫారంలో ఆన్ బోర్డ్ చేసుకుంటున్నట్లు వెల్లడైంది. దీని ఫలితంగా ప్రత్యర్థి కంపెనీలైన జొమాటో, స్వీగ్గీ స్టాక్స్ నేడు 2 శాతానికి పైగా నష్టాన్ని చూశాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ర్యాపిడో రూ.400 కంటే తక్కువ విలువైన ఆర్డర్లపై రూ.25 కమిషన్, అలాగే దీనికి పైన విలువ కలిగిన ఆర్డర్లపై రూ.50 కనిషన్ వసూలు చేయాలని చూస్తోంది. అంటే రెస్టారెంట్లు 8 నుంచి 15 శాతం మధ్య కమిషన్లు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది.
ALSO READ IPO News: డబ్బులు ఎవరికీ ఊరకే రావు.. అందుకే ఐపీవోకి వస్తున్న లలితా జ్యువెలరీ
అయితే ఇప్పటికే చాలా కాలంగా ఈ వ్యాపారంలో ఉన్న స్విగ్గీ, జొమాటో వంటి కంపెనీలు రెస్టారెంట్ల నుంచి 15 నుంచి 30 శాతం మధ్య కమిషన్లను ఛార్జ్ చేస్తున్నాయి. ర్యాపిడో దీనికి పూర్తి భిన్నంగా సగం కమిషన్లలతో సేవలను షురూ చేయాలని చూస్తోంది. అలాగే రూ.150 కంటే తక్కువ విలువ కలిగిన ఫుడ్ ఐటమ్స్ జాబితా చేయాలని కోరుతోంది.
దీనికి ముందు గతవారం నోయిడాకు చెందిన ఒక షాపు యజమాని జొమాటో నుంచి తనకు జీరో పేమెంట్స్ రావటం, తన ప్రమేయం లేకుండానే ప్రమోషన్స్ పేరుతో డబ్బు వసూలు చేయటంపై ఎక్స్ పోస్టులో విమర్శించారు. అలాగే కంపెనీ సీఈవోను ట్యాగ్ చేస్తూ చేసిన పోస్ట్ తెగ వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు రెండు కంపెనీల చేతిలో కొనసాగిన పోటీ మూడో ఆటగాడి ఎంట్రీతో ఎలా మారబోతుందనే విషయంపై మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.