
హైదరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లా ముదిగొండలో అరుదైన పాల రాతి బౌద్ధ శిల్ప శకలాలు వెలుగు చూశాయి. ఈ శిల్పాల ఫొటోలను ఖమ్మం సిటీకి చెందిన కవి, లెక్చరర్ ఆర్.సీతారాం కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి పంపగా అవి బౌద్ధ స్తూపానికి తాపడం చేసిన బౌద్ధ శిల్పశకలాలుగా చరిత్ర బృందం కన్వీనర్, కో-కన్వీనర్లు శ్రీరామోజు హరగోపాల్, కట్టా శ్రీనివాస్ గుర్తించారు. రెండింటిలో ఒకటి ‘బుద్ధ పరినిర్వాణం’ చూపే ప్యానెల్, ఇంకొకటి సిద్ధార్థుని మహాభినిష్క్రమణం తర్వాత తాను ఎక్కి వెళ్లిన కంటకాశ్వం తిరిగొచ్చి శుద్ధోదనునికి విషణ్ణవదనంతో విన్నవిస్తున్న దృశ్యం అని చరిత్రకారుడు, స్థపతి శివనాగిరెడ్డి వివరించారు. ఈ స్తూప ఫలకాలు ఇక్ష్వాకుల కాలానికి, 3వ శతాబ్దికి చెందినవని వెల్లడించారు.