యూఏఈ చంద్రుడిపై పరిశోధనలకు ప్రయోగించిన రషీద్రోవర్ ఏప్రిల్ 25న చంద్రుడిపై ల్యాండ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. దీన్ని డిసెంబర్ 2022 లో స్పేస్ఎక్స్ రాకెట్లో చంద్రుడిపైకి ప్రయోగించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చంద్రుడి పై ల్యాండింగ్చేయడానికి ప్రయత్నించిన మొదటి ఎమిరేట్ మిషన్ ఇది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రోవర్ కావడం విశేషం. జపాన్కి చెందిన హకుటో- ఆర్ మిషన్ సాయంతో ప్రయోగించిన ఈ రోవర్ నెల క్రితం చంద్ర కక్ష్యలోకి చేరుకుంది. ఇందుకోసం ఐదు నెలల సమయం పట్టింది. అంతరిక్షంలో 1.6 మిలియన్ కిలోమీటర్ల దూరం పయనించింది.
రషీద్ రోవర్ అంటే...
యూఏఈ తయారు చేసిన మొదటి చంద్ర మిషన్ని ల్యాండ్ చేయడానికి హకుటో ఆర్ మిషన్ (రషీద్ రోవర్)ని చంద్రుడి ఉపరితలంపైకి పంపారు. దీనిని దుబాయ్ లోని మహ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్లో అభివృద్ధి చేశారు. ఆధునిక దుబాయ్నిర్మాణానికి కారణమైన దివంగత షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ గుర్తుగా దీనికి పేరు పెట్టారు.
ముఖ్య ఉద్దేశం..
చంద్రుడి ఉపరితలంపై రవాణా తదితర అంశాలను కనుక్కునేందుకు ఎమిరాటీ శాస్త్రవేత్తలు రషీద్ రోవర్ను రూపొందించారు. నాలుగు చక్రాలు కలిగిన ఇది సెకనుకు 10 సెం.మీ. ల గరిష్ఠ వేగంతో కదులుతుంది.10 సెం.మీ.ల అడ్డంకిని అధిరోహించగలదు. 10 కేజీల బరువున్న ఈ రోవర్లో రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఒకటి చంద్రుడి ఉపరితల దృశ్యాలను చిత్రీకరిస్తుంది. రషీద్లోని మైక్రోస్కోపిక్ ఇమేజర్ రెగోలిత్ పొర అధ్యయనానికి, చంద్రుడి చుట్టూ ఉన్న ప్లాస్మా అధ్యయనానికి ఉపయోగపడుతుంది. ఈ మిషన్ విజయవంతం అయితే చంద్రుడి ఉపరితలంపైకి రోవర్లను పంపిన అమెరికా, రష్యా, చైనాల సరసన యూఎఈ, జపాన్లు చేరతాయి.