
టమాటా ధరలు దేశ వ్యాప్తంగా ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్యుడికి టమాటా కొనడం అనేది గగనంగా మారింది. ఈ క్రమంలో కేంద్రం ఓ అద్భుతమైన నిర్ణయాన్ని వెల్లడించింది. కిచెన్ ఐటెమ్స్ లో అత్యంత కీలకంగా భావించే టమాటాలను తక్కువ ధరకే అందించేందుకు ముందుకు వచ్చింది. అధిక ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి రిటైల్ మార్కెట్లలో జూలై 16 నుంచి కిలోకు రూ.80కే విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఇంతకు ముందు ఈ ధర రూ.90గా ఉండేది.
కేంద్రం ఢిల్లీ-ఎన్సీఆర్లో జూలై 14న మొబైల్ వ్యాన్ల ద్వారా టమాటాలను కిలోకు రూ.90కే విక్రయించడం ప్రారంభించింది. ఆ తర్వాత మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేసింది. టమాటాలను రాయితీపై విక్రయించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో టమాటా హోల్సేల్ ధరల్లో తగ్గుదల చోటు చేసుకుందని వ్యాపారులు చెబుతున్నారు.
దేశంలోని 500లకు పైగా ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసిన తర్వాత, కేంద్రం ఈ రోజు నుంచి టమాటా కిలోకు రూ. 80 చొప్పున విక్రయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.