బియ్యమే.. గోధుమల్లేవ్..రేషన్ షాపుల్లో సరుకుల కొరత

బియ్యమే.. గోధుమల్లేవ్..రేషన్ షాపుల్లో సరుకుల కొరత
  •  గోడౌన్లకు పోతే లేవంటున్నరని డీలర్లు 
  • డీలర్లే తీసుకుపోవట్లేదని ఆఫీసర్లు  
  • కొన్ని చోట్ల బియ్యం లేక షాపుల మూత  
  • మరికొన్ని చోట్ల నో స్టాక్​బోర్డులు  
  • మూడు నెలల సరుకుల పంపిణీలో గందరగోళం 

హైదరాబాద్ ​సిటీ, నెట్​వర్క్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మూడు నెలలకు సరిపడా రేషన్​ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించగా, నగరంలోని చాలా షాపుల్లో బియ్యం, గోధుమలు, చక్కెర పంపిణీ సరిగ్గా జరగడం లేదు. చాలా చోట్ల డీలర్లు లబ్ధిదారులకు కేవలం బియ్యం మాత్రమే ఇచ్చి పంపిస్తున్నారు. అధికారులు మాత్రం తాము డీలర్లకు అన్ని సరుకులు సరఫరా చేస్తున్నామని, ఈ గందరగోళం అంతటికీ వారిదే బాధ్యత అని అంటున్నారు. కొందరు డీలర్లు వారికి కేటాయించిన సరుకులను గోదాముల నుంచి తీసుకోవడం లేదంటున్నారు. 

డీలర్లేమో తమకు సకాలంలో సరుకులు ఇవ్వడం లేదని, గోదాములకు వెళ్తే స్టాక్​లేదని తిప్పి పంపుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో లబ్ధిదారులకు సమాచారం ఇవ్వకుండా రోజుల తరబడి షాపులు మూసుకుంటుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొన్ని చోట్ల నో స్టాక్​ బోర్డులు కనిపిస్తున్నాయి. 

ఇప్పటివరకు ఒకే కోటా రిలీజ్​

లబ్ధిదారులకు మూడు నెలలకు సరిపడా సరుకులు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకూ ఒకే నెలకు సంబంధించిన బియ్యం కోటా రిలీజ్​అయ్యిందని, రెండో నెల కోటా కోసం ఎదురుచూస్తున్నట్టు సికింద్రాబాద్​కు చెందిన ఓ రేషన్​డీలర్​ చెప్పారు. మొదటి అలాట్​మెంట్​ సరుకులు ఇచ్చినా కార్డుదారులకు మాత్రం మూడు నెలలకు సరిపడా సరుకులు ఇస్తున్నామని, దీంతో నిల్వలు అయిపోయి రెండో కోటా కోసం వెళ్తే గోదాముల్లో లేవంటున్నారన్నారు. పాతబస్తీలో కొన్ని సర్కిళ్ల పరిధిలో ఒకే కుటుంబానికి మూడు నెలలకు సంబంధించిన బియ్యం దాదాపు రెండు క్వింటాళ్ల వరకూ ఇవ్వాల్సి వస్తోందని, దీంతో రెండు, మూడు రోజుల్లోనే సరుకులు అయిపోతున్నాయంటున్నారు. దీంతో నోస్టాక్​ బోర్డులు పెడుతున్నామని పాతబస్తీకి చెందిన ఓ డీలర్​వెల్లడించారు. 

జాడలేని గోధుమలు..

నగరంలో చాలా రేషన్​షాపుల్లో గోధుమలు ఇవ్వడం లేదు. కేవలం బియ్యం మాత్రమే పోసి పంపిస్తున్నారు. లబ్ధిదారులకు అవగాహన లేకపోవడంతో అడగడం లేదు. ఎవరైనా అడిగితే ఈసారి ప్రభుత్వం నుంచే రాలేదని చెప్పి పంపిస్తున్నారు. పంజాగుట్ట, సికింద్రాబాద్,​ బన్సీలాల్ పేట, రాంనగర్​, బోయగూడ, బౌద్ధనగర్, లంగర్ హౌస్, గోల్కొండ, మెహిదీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లోని రేషన్​షాపుల్లో ‘వెలుగు ప్రతినిధి’ పరిశీలించగా ఎక్కడా గోధుమలు ఇవ్వడం లేదు. డీలర్లను అడిగితే తమకు గోధుమలు సరఫరా కాలేదని చెప్తున్నారు. 

అధికారులేమో సిటీలోని అన్ని షాపులకు కలిపి 9,709.230 మెట్రిక్​ టన్నుల గోధుమలు కేటాయించామంటున్నారు. అధికారులు కేటాయించినా, తాము గోదాములకు పోతే లేవంటున్నారని, లబ్ధిదారులు గోధుమల గురించి అడిగితే సమాధానం చెప్పలేక, బియ్యమూ లేక తమలో చాలామంది షాపుల ముందు నో స్టాక్​బోర్డులు పెడుతున్నారని డీలర్లు అంటున్నారు.  

ఏఏపీ కార్డులకే చక్కెర

రేషన్​కార్డుల్లో మూడు రకాలున్నాయి. దివ్యాంగులు, వృద్ధులు, భర్తలేని మహిళలకు కేంద్రం అన్నపూర్ణ అన్నయోజన పథకం(ఏఏపీ) కింద 1290 కార్డులిచ్చింది. అంత్యోదయ ఫుడ్​సేఫ్టీ (ఎఎఫ్ఎస్​సీ) కార్డులు 29,584 ఉన్నాయి. అలాగే, జనరల్​ కేటగిరీలో ఫుడ్​సేఫ్టీ కార్డులు(ఎఫ్​ఎస్​సి) 6,08,577 ఉన్నాయి. ఇవన్నీ కలిపి 6,39,451 కార్డులున్నాయి.  ఇందులో 24,24,824 మందికి మూడు నెలలకు గాను ప్రభుత్వం 45,259.677 మెట్రిక్ ​టన్నుల బియ్యం, 9,709.230 మెట్రిక్​ టన్నుల గోధుమలు, 88.695 మెట్రిక్​ టన్నుల చెక్కర కేటాయించింది. 

కార్డులో పేరున్న ఒక్కో వ్యక్తికీ 6 కిలోలు అంటే మూడు నెలలకు18 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే, ఏఏపీ కార్డుదారులకు మాత్రమే 35 కిలోల బియ్యంతో పాటు కిలో చక్కెర ఇస్తున్నారు. మిగిలిన వారికి చక్కర ఇవ్వట్లేదు. బియ్యం, గోధుమలు మాత్రమే ఇస్తున్నారు. అయితే, గోదామల నుంచి సప్లై లేక ఇవి కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నట్టు తెలుస్తోంది.  

గోధుమల సమస్య మాత్రమే ఉంది 

సరుకుల పంపిణీలో ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా మంది డీలర్లు తమ కోటా తీసుకుపోవడం లేదు. మేం గోదాములకు ఎప్పటికప్పుడు బియ్యం సరఫరా చేస్తున్నాం. రెండో కోటా కూడా ఇస్తున్నాం. అయితే, గోధుమల కేటాయింపుల్లో మాత్రం కొన్ని ఇబ్బందులున్నాయి. త్వరలో ఆ సమస్య కూడా పరిష్కారమవుతుంది. చక్కెర ఏఏపి కార్డుదారులకే ఇస్తున్నాం.