- గత నెల కన్నా రూ.12 కోట్లు తక్కువ పలికిన ధర
- రెండు ప్లాట్లకు టీజీఐఐసీ వేలం
హైదరాబాద్, వెలుగు: రాయదుర్గంలో భూముల ధరలు ఈ సారి రికార్డు మార్కును తాకలేకపోయాయి. గత నెలలో నిర్వహించిన వేలంలో ఎకరం భూమి రూ.177 కోట్లకు అమ్ముడుపోగా.. ఈసారి అంతకన్నా తక్కువ ధరే పలికాయి. రాయదుర్గంలోని 4,700 గజాల్లోని రెండు ప్లాట్లకు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) వేలం పాట నిర్వహించగా.. రూ.160 కోట్లే పలికింది.
వాస్తవానికి గజానికి అప్సెట్ ప్రైస్గా రూ.3.10 లక్షలుగా నిర్ణయించారు. అంతకన్నా ఎక్కువకు బిడ్ వేయాలని టీజీఐఐసీ వేలం డాక్యుమెంట్లలో పేర్కొంది. వేలంలో పాల్గొన్న సంస్థల్లో గరిష్టంగా రూ.3.4 లక్షలకు ఓ సంస్థ బిడ్ వేసింది. మొత్తంగా 4,700 గజాలకు రూ.160 కోట్లు పలికింది. అంటే ఒక్క ఎకరం (4,840 గజాల) భూమి విలువ రూ.165 కోట్లు మాత్రమే.
అయితే, ఇప్పుడు వేలంలో గజం భూమికి దక్కిన ధర 2017లో దక్కిన దానికన్నా నాలుగు రెట్లు ఎక్కువ. 2017లో ఇదే ప్రాంతంలోని భూమిని వేలం వేయగా.. గజం ధర రూ.88 వేలు పలికింది. ఇప్పుడు మాత్రం రూ.3.40 లక్షలు దక్కింది.
రెండు ప్లాట్ల మధ్య బండ రాళ్లుండడమే కారణం
అక్టోబర్లో ఇదే ప్రాంతంలోని భూములను వేలం వేయగా ఎంఎస్ఎన్ రియాల్టీ అనే సంస్థ ఎకరం భూమిని రూ.177 కోట్లు పెట్టి మరీ దక్కించుకున్నది. ఈసారి కనీసం రూ.200 కోట్లయినా వస్తాయని అంతా భావించారు. కానీ, గతంలో వచ్చిన ధర కన్నా రూ.12 కోట్లు తక్కువే వచ్చింది. దానికీ కారణం లేకపోలేదు. ప్రస్తుతం వేలం వేసిన ఈ రెండు ప్లాట్ల మధ్య పెద్ద బండ రాళ్లు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.
దీంతో బిడ్డర్లు అంతకన్నా ఎక్కువ కోట్ చేయడానికి ఇష్ట పడలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతే తప్ప అక్కడ ధర తగ్గలేదని చెబుతున్నారు. చాలా మంది వ్యాపారవేత్తలు మంచి బిజినెస్ కారిడార్లోనే ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారని, అందుకు తగ్గట్టుగానే రాయదుర్గంలో భూములపై ఇన్వెస్ట్ చేస్తున్నారని అంటున్నారు. కాగా, ఈ భూమిని దక్కించుకున్న సంస్థ వారంలోగా భూమి విలువలోని 25 శాతం బిడ్ అమౌంట్ను టీజీఐఐసీకి చెల్లించాల్సి ఉంటుంది.
