![ప్రభుత్వానికి 1.76 లక్షల కోట్లిద్దాం](https://static.v6velugu.com/uploads/2019/08/RBI.jpg)
- జలాన్ కమిటీ సిఫార్సులకు ఆర్బీఐ ఓకే
ఆర్బీఐ మిగుల నిధుల బదిలీపై సిఫార్సులు చేయడానికి ఈ సంస్థ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ నివేదికకు గ్రీన్సిగ్నల్ వచ్చింది. కమిటీ సిఫార్సు చేసిన విధంగానే కేంద్ర ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల రిజర్వులను బదిలీ చేయడానికి ఆర్బీఐ బోర్డు ఒప్పుకుంది. వీటిలో 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1.23 లక్షల కోట్లు ఉండగా, ఎకానమిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ (ఈసీఎఫ్) ప్రకారం ఇవ్వాల్సినవి రూ.52 వేల కోట్లు ఉన్నాయి. ఆర్బీఐ దగ్గర మూలధన నిల్వలు ఎంత ఉండాలి, కేంద్ర ప్రభుత్వానికి ఎంత డివిడెంట్ ఇవ్వొచ్చు ? అనే అంశాలతోపాటు ఎకనమిక్ కాపిటల్ ఫ్రేమ్వర్క్ (ఈసీఎఫ్)ను అధ్యయనం చేసి రిపోర్టు ఇచ్చేందుకు జలాన్ నేతృత్వంలో గత డిసెంబరులో కమిటీని వేశారు. ఆరుగురు మెంబర్లు ఉన్న ఈ కమిటీ ఆర్బీఐ మూలధన నిల్వలను సమీక్షించి, నివేదిక తయారు చేసి శనివారం అందజేసింది. ఆర్బీఐ వద్ద ఉన్న మిగులు మూలధన నిల్వలు రూ. 9.6 లక్షల కోట్లని అంచనా. వీటి పంపకం విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఈ కమిటీని
నియమించారు.