న్యూఢిల్లీ:ఆర్బీఐ మూడు నెలల మారటోరియం సర్క్యులర్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను అడ్వకేట్ అమిత్ సాహ్ని దాఖలు చేశారు. ఆర్బీఐ మారిటోరియం కేవలం కంటి తుడుపు చర్యేనని, ఎలాంటి ప్రయోజనం అందించదని ఆయన ఆ పిటిషన్లో పేర్కొన్నారు. మారిటోరియం కాలంలో బ్యాంక్లు, ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్స్ వడ్డీని విధిస్తారని, రెగ్యులర్ ఈఎంఐలతో పాటు అదనంగా వడ్డీని చెల్లించడంలో ఎలాంటి అర్థం లేదని తన పిటిషన్లో అమిత్ సాహ్ని చెప్పారు. మారిటోరియం కాలంలో ఏ బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా వడ్డీ విధించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఆర్బీఐ దీనిపై క్లారిటీ ఇవ్వాలని తెలిపారు. మారిటోరియంపై మార్చి 27న ఆర్బీఐ జారీ చేసిన సర్క్యూలర్ను పక్కన పెట్టాలని కోరారు.
అంతేకాక మారిటోరియం కాలాన్ని కూడా పొడిగించేలా కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే కరోనా వైరస్ కారణంతో లక్షల మంది ప్రజలు నిరుద్యోగులుగా మారారని, లాక్డౌన్ తర్వాత కూడా ప్రజలకు ఊరట కల్పించాలని అభ్యర్థించారు. కరోనా వైరస్ కారణంతో, ఫైనాన్సియల్గా ప్రజలకు ఇబ్బందులు పడకుండా ఆర్బీఐ అన్ని టర్మ్ లోన్ల ఈఎంఐల చెల్లింపుపై మూడు నెలల మారిటోరియాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి మే 31 వరకున్న కాలంలో ఈ మారిటోరియాన్ని అమలు చేయాలని బ్యాంక్లను, అన్ని ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్లను ఆర్బీఐ కోరింది. ఇప్పటికే ఈ మారిటోరియాన్ని అన్ని బ్యాంక్లు అమల్లోకి తెచ్చాయి. ఈ మారిటోరియంపై లోన్లు తీసుకున్న వారిలో గందరగోళ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మారిటోరియం తీసుకుంటే, అదనంగా వడ్డీ భారాన్ని భరించాల్సి వస్తున్నది. డబ్బులు కట్టే స్థోమత ఉన్న వారు కట్టేసుకుంటే మేలని సలహా ఇస్తున్నారు. మరోవైపు అన్ని బ్యాంక్లు డిఫాల్ట్గా మారిటోరియం అమలు చేయాలని ఆర్బీఐ ఆదేశించింది.