- తాజా ఆర్బీఐ రేట్ల పెంపుపై మాట్లాడిన నిర్మలా సీతారామన్
- ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చులపై ఎటువంటి ప్రభావం ఉండదు
- క్రూడాయిల్ ఎక్కడ చౌక అయితే అక్కడి నుంచే కొంటం
ముంబై: ఆర్బీఐ తాజాగా వడ్డీ రేట్లను పెంచడం ఆశ్చర్యం కలిగించలేదని, కానీ, టైమింగే ఆశ్చర్యపరిచిందని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అన్నారు. ఫండ్స్ను సేకరించడానికి ఖర్చు పెరిగినప్పటికీ, ఇన్ఫ్ట్రాస్ట్రక్చర్ కోసం ప్రభుత్వం చేసే ఇన్వెస్ట్మెంట్స్పై ఎటువంటి ప్రభావం ఉండదని పేర్కొన్నారు. ఆర్బీఐ 2018, ఆగస్ట్ తర్వాత మొదటి సారిగా ఈ నెల 4 న రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు ( 4.40 శాతానికి) పెంచింది. రిటైల్ ఇన్ఫ్లేషన్ ఈ ఏడాది మార్చిలో 6.9 శాతానికి పెరగగా, ఏప్రిల్లో 7.7 శాతంగా ఉంటుందని అంచనా.
అన్ని సెంట్రల్ బ్యాంకులు పెంచుతున్నయ్
‘ఆర్బీఐ రేట్లను పెంచడం ఆశ్చర్యం కలిగించలేదు. సడెన్గా పెంచడం ఆశ్చర్యం కలిగించింది. రేట్ల పెంపు కచ్చితంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. రెండు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మీటింగ్లకు మధ్య రేట్ల పెంపు జరగడం ఆశ్చర్యం కలిగించింది’ అని సీతారామన్ అన్నారు. ఓ ఆవార్డ్ ఫంక్షన్లో పాల్గొన్న ఆమె ఆర్బీఐ రేట్ల పెంపుపై మొదటిసారిగా మాట్లాడారు. రేట్ల పెంపు ఉంటుందనే సంకేతాలను కిందటి ఎంపీసీ మీటింగ్లోనే ఆర్బీఐ ఇచ్చిందని గుర్తు చేశారు. ‘అన్ని దేశాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా రేట్లు పెంచింది. యూఎస్ కూడా ఆ రోజు రాత్రే రేట్లు పెంచింది. సెంట్రల్ బ్యాంకులన్నీ ఒకేలా ఆలోచిస్తున్నాయి. కరోనా నుంచి రికవరీ అవ్వడంపై అన్ని దేశాలు పనిచేస్తున్నాయి’ అని సీతారామన్ పేర్కొన్నారు. సంక్షోభం నుంచి రికవరీ అవుతున్నామని, ఇన్ఫ్లేషన్ మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉందని చెప్పారు
చౌకగా ఆయిల్ దొరికితే కొంటం..
ప్రభుత్వం ఇన్ఫ్ట్రాస్ట్రక్చర్ కోసం చేసే ఖర్చులపై ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపించదని చెప్పుకొచ్చారు నిర్మలా సీతారామన్. రష్యాపై వెస్ట్రన్ దేశాలు విధిస్తున్న ఆంక్షలపై ఆమె మాట్లాడారు. ఈ ఆంక్షల వలన రష్యా ఆయిల్ను కొంటున్న దేశాలు మిడిల్ ఈస్ట్లోని క్రూడాయిల్ వైపు చూస్తున్నాయని, దీంతో ఈ క్రూడ్ ధరలు పెరుగుతున్నాయని అన్నారు. చౌకగా ఆయిల్ ఎక్కడ దొరికినా ఇండియా కొనుగోలు చేస్తుందని మరోసారి చెప్పారు.