
బెంగళూరు: ఐపీఎల్18వ సీజన్లో సూపర్ పెర్ఫామెన్స్ చేస్తు తొలిసారి విజేతగా నిలవాలని ఆశిస్తున్న రాయల్ చాంలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఆ టీమ్ ప్రధాన పేసర్ ఆస్ట్రేలియా స్టార్ జోష్ హేజిల్వుడ్ గాయపడ్డాడు. ఆర్సీబీ రూ.12.5 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసిన హేజిల్వుడ్ ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్ల్లో 18 వికెట్లు తీశాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ తన వద్దే ఉంది.
గాయం కారణంగానే ఈ నెల 3న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో పాల్గొనలేదు. ప్రస్తుతానికి హేజిల్వుడ్ గాయం తీవ్రతపై స్పష్టత లేదు. కానీ తను మిగిలిన లీగ్లో పాల్గొనడం అనుమానంగా మారింది. మరోవైపు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ కూడా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. చెన్నైతో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా చేతి వేలికి గాయమైంది.
లీగ్ కొనసాగి ఉంటే తను రెండు మూడు మ్యాచ్లకు దూరం అయ్యేవాడు. వేలికి స్ల్పింట్ ధరించి, కనీసం 10 రోజుల పాటు ట్రెయినింగ్కు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. లీగ్కు గ్యాప్ రావడంతో ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. మెగా టోర్నీ తిరిగి మొదలయ్యేనాటికి పూర్తిగా కోలుకునే చాన్స్ కనిపిస్తోంది.