బొగ్గు గనుల వేలంలో పాల్గొనేందుకు సింగరేణి రెడీ.. జూన్ 19 నుంచి 22 వరకు బొగ్గు బ్లాకుల వేలం

బొగ్గు గనుల వేలంలో పాల్గొనేందుకు సింగరేణి రెడీ.. జూన్  19 నుంచి 22 వరకు బొగ్గు బ్లాకుల వేలం
  • మణుగూరు పీకే ఓసీ డీప్  సైడ్, ఛత్తీస్ గఢ్​లో బ్లాకులు దక్కించుకోవడానికి కసరత్తు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రాష్ట్రంతో పాటు దేశంలోని 19 కోల్​ బ్లాక్​లను కోల్​ మినిస్ట్రీ వేలానికి పెట్టింది. ఈ నెల 19 నుంచి 22 వరకు వేలం నిర్వహించనున్నారు. తెలంగాణలోని మణుగూరు పీకే ఓసీ డీప్​ సైడ్​ ఓసీ బ్లాక్​తో పాటు ఛత్తీస్​గఢ్​లోని ఓ కోల్​ బ్లాక్​ను దక్కించుకుందుకు సింగరేణి కసరత్తు చేస్తోంది. 

పదేండ్లుగా బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకుండా గత బీఆర్ఎస్​ ప్రభుత్వం అడ్డకట్ట వేసింది. దీంతో కొత్త బ్లాక్​ రాని పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు ఉన్న బొగ్గు బావులు ఒక్కొక్కటిగా మూత పడుతుండగా, మరోవైపు కొత్త మైన్స్​ రాకపోవడంతో సింగరేణిలో మ్యాన్​ పవర్​ సర్​ప్లస్​ ఏర్పడింది. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం కోల్​ మినిస్ట్రీ నిర్వహించే కోల్​ బ్లాకుల వేలంలో పాల్గొనేందుకు సింగరేణికి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. లాస్ట్​ టైం నిర్వహించిన వేలంలో మణుగూరు పీకే ఓసీ డీప్​ సైడ్​ ఎక్స్​టెన్షన్​ కోల్​ బ్లాక్​ కోసం మొదటిసారి సింగరేణి వేలంలో పాల్గొంది. ఈ కోల్​ బ్లాక్​ కోసం రెండోసారి సింగరేణి వేలంలో పాల్గొనేందుకు సిద్దమవుతోంది.

రెండు బ్లాక్​ల కోసం..

దేశవ్యాప్తంగా 19 కోల్​ బ్లాకులను కోల్​ మినిస్ట్రీ వేలంలో పెట్టింది. రాష్ట్రంలోని భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు పీకే ఓసీ డీప్​ సైడ్​ ఎక్స్​టెన్షన్​ కోల్​ బ్లాక్​తో పాటు ఛత్తీస్​గఢ్​లోని మరో కోల్​ బ్లాక్​ను దక్కించుకునేందుకు సింగరేణి సిద్ధమవుతోంది. 

పీకే ఓసీ కోసం గతంలో సింగరేణితో పాటు జెన్కో సంస్థ పోటీ పడ్డాయి. ఈక్రమంలో తాము రెండో గ్రూప్​లో వేలంలో పాల్గొంటామని కోల్​ మినిస్ట్రీకి సింగరేణి విన్నవించింది. దీంతో ఈ నెల 19 నుంచి జరగనున్న కోల్​ బ్లాకుల వేలంలో పీకే ఓసీని కోల్​ మినిస్ట్రీ పెట్టింది. 

ప్రస్తుతం పీకే ఓసీ పక్కనే ఉన్న ఈ బ్లాక్​ వస్తే సింగరేణికి వరంగా మారనుంది. ఈ బ్లాక్​లో 120 మిలియన్​ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. జీ8, జీ10, జీ13 గ్రేడ్​ బొగ్గు నిల్వలుఈ కోల్​ బ్లాక్​ లో ఉన్నాయి. జీ8, జీ10 గ్రేడ్​ బొగ్గు రకానికి మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉంది.

 ఈ బ్లాక్​ను ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో సింగరేణి యాజమాన్యం కసరత్తు చేస్తోంది. దీంతోపాటు ఛత్తీస్​గఢ్​లోని మరో బ్లాక్ ను దక్కించుకునేందుకు సింగరేణి ఫోకస్​ పెట్టింది. ఈ బ్లాక్​లోనూ నాణ్యతతో కూడిన బొగ్గు నిల్వలున్నాయి. స్టిప్పింగ్​ రేషియో కూడా తక్కువగా ఉండడంతో ఈ బ్లాక్​ను దక్కించుకునేందుకు యాజమాన్యం రంగం సిద్ధం చేస్తోంది. 

సింగరేణికి ఇస్తేనే మేలు..

రాష్ట్రంలోని భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు పీకే ఓసీ డీప్​ సైడ్​ ఎక్స్​టెన్షన్​ ఓసీని వేలంలో సింగరేణికి కేటాయించేలా కోల్​ మినిస్ట్రీ చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. ఈ విషయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్​రెడ్డి చొరవ చూపాలంటున్నారు. 

గతంలో సత్తుపల్లి, ఇల్లెందు ఏరియాల్లోని కోయగూడెం ఓసీలను వేలంలో ఇతర సంస్థలు దక్కించుకున్నా మూడేండ్లుగా మైనింగ్​ ఆపరేషన్స్​ చేయడం లేదు. కోయగూడెంతో పాటు సత్తుపల్లి కోల్​ బ్లాక్​లో మైనింగ్​ ఆపరేషన్స్​ చేయాలంటే సింగరేణి సహకారం తప్పనిసరిగా మారింది. 

ప్రస్తుతం ఉన్న బొగ్గు బావులకు ఆనుకునే ఆ రెండు మైన్స్​ ఉండడంతో ఇతర సంస్థలు మైనింగ్​ ఆపరేషన్స్​ చేయడం ఆషామాషీ కాదని అంటున్నారు. ఈ క్రమంలో సత్తుపల్లి ఓసీని దక్కించుకున్న సంస్థ చేతులెత్తేసింది. కోయగూడెం ఓసీని దక్కించుకున్న సంస్థ తాము ఆపరేషన్స్​ చేయలేమని, తాము పెట్టిన పెట్టుబడి ఇవ్వాలంటూ కోర్టుకెక్కింది. ప్రస్తుతం వేలంలో పెట్టిన మణుగూరు పీకే ఓసీ డీప్​ సైడ్​ ఎక్స్​టెన్షన్​ కోల్​ బ్లాక్​ కూడా ఇతర సంస్థలు చేసే పరిస్థితి లేదు. 

ఈ క్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని ఈ బ్లాక్​ను సింగరేణికి నేరుగా కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్​ చేస్తున్నారు. సత్తుపల్లి ఓసీతో పాటు కోయగూడెం ఓసీలను వేలంతో సంబంధం లేకుండా సింగరేణికి కేటాయించి, సింగరేణి సంస్థను ఆదుకోవాలని కార్మికులతో పాటు కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు.