భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వైద్యసేవలు, సౌకర్యాలపై హెల్త్ మినిష్టర్ దామోదర రాజ నర్సింహ స్పెషల్ ఫోకస్పెట్టారు. బుధవారం జిల్లా ప్రజాప్రతినిధులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం కావడంతో వానా కాలంలో వ్యాధులపై అప్రమత్తతతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది ఖాళీలు, ఇతర పలు అంశాలను ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు రఘురామిరెడ్డి, బలరాం నాయక్తో పాటు ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ మినిష్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి మండలానికి అంబులెన్స్, ఏరియా హాస్పటల్స్కు దశల వారీగా సీటీ స్కాన్ సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇల్లెందు ఏరియా హాస్పటల్లో ఐసీయూ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
