ఆపరేషన్ సిందూర్‎లో ధ్వంసమైన టెర్రర్ లాంచ్ ప్యాడ్ల రీబిల్డింగ్.. సహకరిస్తున్న పాక్ ఆర్మీ, ఐఎస్ఐ!

ఆపరేషన్ సిందూర్‎లో ధ్వంసమైన టెర్రర్ లాంచ్ ప్యాడ్ల రీబిల్డింగ్.. సహకరిస్తున్న పాక్ ఆర్మీ, ఐఎస్ఐ!

న్యూఢిల్లీ: ఆపరేషన్  సిందూర్‎లో ధ్వంసమైన టెర్రర్  లాంచ్ ప్యాడ్లను పాకిస్తాన్  మళ్లీ నిర్మిస్తోంది. నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలోని దట్టమైన అడవుల్లో వీటికి ఏర్పాట్లు చేస్తోంది. ల్యాంచ్ ప్యాడ్ల పునర్నిర్మాణానికి ఆ దేశ ఆర్మీ, ఐఎస్ఐ సహకరిస్తున్నాయని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెలిపాయి. మౌలిక సౌకర్యాలు కల్పించడంతో పాటు భారీగా నిధులు అందిస్తున్నాయని ఆ ఏజెన్సీలు పేర్కొన్నాయి. ‘‘పాక్  గూఢచార సంస్థ ఇంటర్  సర్వీసెస్  ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), ఆర్మీతో కలిసి పాకిస్తానీ టెర్రర్  సంస్థలు హైటెక్‌‌‌‌ ఉగ్రవాద స్థావరాలు నిర్మిస్తున్నాయి. 

నిఘా, ఎయిర్ స్ట్రైక్స్ నుంచి తప్పించుకునేందుకు నియంత్రణ రేఖ వద్ద దట్టమైన అడవుల్లో వాటి నిర్మాణం జరుగుతోంది. లుని, పుత్వాల్, తైపు పోస్ట్, జమీలా పోస్ట్, ఉమ్రాన్ వలీ, చప్రార్, ఫార్వర్డ్  కహుతా, ఛోటా చాక్, జంగ్లోరా వంటి ప్రాంతాల్లో లాంచ్ ప్యాడ్ల రీబిల్డింగ్  చేస్తున్నారు. రాడార్  వ్యవస్థకు దొరకని అత్యాధునిక టెక్నాలజీని వీటి నిర్మాణం కోసం వాడుతున్నారు” అని ఇంటెలిజెన్స్  అధికారి ఒకరు ఓ టీవీ చానెల్ కు తెలిపారు. 

అలాగే కేల్, షర్దీ, దుధ్ నియాల్, అత్ ముఖం, జురా, లీపా వ్యాలీ, పచిబన్, చమన్, తాండ్ పనీ, నైయాలీ, జాన్ కోట్, చకోటి, నికైల్​లోనూ లాంచ్ ప్యాడ్లను రీడెవలప్  చేసేందుకు పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని ఆయన చెప్పారు. జమ్మూ సమీపంలోని అంతర్జాతీయ సరిహద్దులో ధ్వంసమైన నాలుగు లాంచ్ ప్యాడ్లను కూడా మళ్లీ నిర్మిస్తున్నారని వెల్లడించారు. 

కాగా.. పహల్గాం టెర్రర్ అటాక్‎కు ప్రతీకారంగా భారత భద్రతా బలగాలు గత నెల 7న ‘ఆపరేషన్  సిందూర్’ నిర్వహించి పాక్‎తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో టెర్రర్ లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేశాయి. ఈ ప్రతీకార దాడుల్లో తొమ్మిది టెర్రర్ లాంచ్ ప్యాడ్లు నాశనమయ్యాయి. వాటిలో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్  టెర్రర్ సంస్థలకు చెందిన ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. బహవల్​పూర్‎లో జైషే హెడ్ క్వార్టర్స్‎కు తీవ్రంగా డ్యామేజీ జరిగింది.

తెలివిగా క్యాంపులుగా విభజన

టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లన్నీ ఒకేచోట ఉండకుండా ఈసారి వాటిని చిన్నచిన్న క్యాంపులుగా ఐఎస్ఐ విభజించింది. లాంచ్ ప్యాడ్లు ఒకేచోట ఉంటే దాడులకు గురైనపుడు భారీగా నష్టం వాటిల్లుతుందని, ఈ నేపథ్యంలో వాటిని చిన్నచిన్న యూనిట్లుగా విభజించి నిర్మిస్తున్నది. ఆ నిర్మాణాలను పాక్  ఆర్మీ అధికారులు పర్యవేక్షిస్తున్నారని ఇంటెలిజెన్స్  వర్గాలు తెలిపాయి.