న్యూఢిల్లీ : చట్టపరమైన నిబంధనలను ఉటంకిస్తూ దాతల వివరాలను వెల్లడించేందుకు పార్టీలు నిరాకరిస్తున్నాయి. పోస్ట్ ద్వారా బాండ్స్ అందుకున్నామని, వాటిపై దాతల పేర్లు లేవని మరికొన్ని పార్టీలు దాటవేస్తున్నాయి. కింగ్ సాంటియాగో మార్టిన్స్ ఫ్యూచర్ గేమింగ్స్ లాటరీ సంస్థనుంచి 77% నిధులు పొందిన డీఎంకే పార్టీ 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు డోనర్స్ వివరాలను దాదాపుగా మొత్తం వెల్లడించింది.
రాజకీయ పార్టీలకు అందే విరాళాల్లో కచ్చితత్వం పెంచడం, అదే సమయంలో దాతల వివరాలను గోప్యంగా ఉంచడమే లక్ష్యంగా ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో బీజేపీ పేర్కొన్నది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తమకు వచ్చిన నిధులు, ఎలక్టోరల్ బాండ్స్ కొన్న దాతలు, వారి బ్యాంకు అకౌంట్ వివరాలు, ఆ నిధులు ఏ తేదీన జమయ్యాయి? అనే వివరాలు ఇవ్వాలని ఎస్బీఐకి లేఖ రాసింది.
కాగా, ఎలక్షన్ కమిషన్కు తాము సమర్పించిన వివరాలనే రాజకీయ పార్టీలకు ఇస్తామని ఎస్బీఐ కాంగ్రెస్కు జవాబిచ్చింది. రూ.లక్ష, రూ. పది లక్షల బాండ్ల వివరాలను వెల్లడించిన సమాజ్వాదీ పార్టీ.. రూ. కోటిచొప్పున వచ్చిన పది ఎలక్టోరల్ బాండ్లపై దాతల పేర్లు లేవని పేర్కొన్నది. దాతల పేర్లు వెల్లడించేందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సంసిద్ధంగా లేదు. తమ పార్టీకి వచ్చిన బాండ్లన్నీ పోస్టు ద్వారానే వచ్చాయని, దాతలెవరో తమకూ తెలియదని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పేర్కొన్నది.
బాండ్లు సమర్పించిన దాతల వివరాలను పొందుపర్చలేదని, తాము వారికి రసీదులు అందజేయలేదంటూ డోనర్ల వివరాలు వెల్లడించేందుకు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ విముఖత వ్యక్తంచేసింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు తెలుసుకునేందుకు పార్టీకి 30 లక్షల విరాళం అందజేసిన వీఎం సాల్గన్కర్ బ్రదర్స్ను గోవా కాంగ్రెస్ సంప్రదించింది. తమ పార్టీకి వచ్చిన రూ. 1.5 కోట్లకు సంబంధించిన విరాళాల వివరాలు అందుబాటులో లేవని ఆర్జేడీ వెల్లడించింది. ఎవరో తమ పార్టీకి 2019లో రూ.10 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ను ఎన్వలప్లో పెట్టి కార్యాలయానికి పంపించారని, వాటిని రెడీమ్ చేసుకున్నామని ఈసీకి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్(యూ) తెలిపింది.
