సింగరేణిలో త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు

సింగరేణిలో త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు
  • నిర్వహణపై ఎనర్జీ డిపార్ట్​మెంట్​కు లెటర్​ రాసిన సీఎండీ

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి కాలరీస్​ కంపెనీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గుర్తింపుసంఘం ఎన్నికల నిర్వహణకు యాజమాన్యం ముందుకు వచ్చింది. సింగరేణి సీఎండీ శ్రీధర్​ స్టేట్​స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ(ఎనర్జీ డిపార్ట్​మెంట్)కు గురువారం లెటర్ ​రాశారు. సింగరేణిలో 2017 అక్టోబర్ 5న జరిగిన ఎన్నికల్లో టీబీజీకేఎస్​ గుర్తింపు సంఘంగా, సింగరేణి కాలరీస్​ వర్కర్స్​ యూనియన్(ఏటీయూసీ) ప్రాతినిధ్య సంఘంగా గెలిచాయి. రెండేండ్లు, నాలుగేండ్లు అంటూ కాలపరిమితిపై కొంతకాలంగా కార్మిక సంఘాలు, కోల్​ మినిస్ట్రీ, సింగరేణి యాజమాన్యం మధ్య గొడవ సాగింది. కోర్టులో కేసు నడుస్తున్న క్రమంలోనే నాలుగేండ్ల కాలపరిమితి గతేడాదితో ముగిసింది. గెలిచినట్టుగా సర్టిఫికెట్​ఆర్ఎల్సీ ఆలస్యంగా ఇచ్చిందంటూ టీబీజీకేఎస్  ​గొడవ చేసింది. మొత్తం మీద ఈ ఏడాది ఏప్రిల్​16తో కాలపరిమితి ముగిసింది. ఈ క్రమంలో ఎన్నికలపై కార్మిక సంఘాలు ఆందోళనలను మరింత ఉద్ధృతం చేశాయి. దీంతో యాజమాన్యం దిగొచ్చింది. స్టేట్​ఎనర్జీ డిపార్ట్​మెంట్​స్పందిస్తే జులై నెలలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని పలువురు కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు.