రికవరీ చేసిన ఫోన్ నుకొట్టేసిన కానిస్టేబుల్..నిందితుడు అరెస్ట్

రికవరీ చేసిన ఫోన్ నుకొట్టేసిన కానిస్టేబుల్..నిందితుడు అరెస్ట్

మెహిదీపట్నం, వెలుగు: పోలీసులు ఓ దొంగ వద్ద నుంచి రికవరీ చేసిన ఫోన్​ను ఠాణా నుంచి ఓ కానిస్టేబుల్​కొట్టేశాడు. నిందితుడిని అరెస్ట్​చేసినట్లు డీసీపీ చంద్రమోహన్​తెలిపారు. కొన్ని రోజుల క్రితం మెహదీపట్నం రైతు బజార్​లో ఓ వ్యక్తి కూరగాయలు తీసుకుంటుండగారూ.1.75 లక్షల విలువైన అతని ఐఫోన్​ను దుండగులు చోరీ చేశారు. 

బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు  ప్రారంభించారు. దొంగను గుర్తించి ఆ ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దాన్ని పోలీస్​స్టేషన్​లోని లాకర్​లో భద్రపరిచారు.

 ఫిర్యాదుదారుడు తన ఫోన్​కోసం ఠాణాకు రాగా.. లాకర్​లో ఉన్న మొబైల్​కనిపించలేదు. ఆ ఫోన్​ను డ్రైవర్ గా విధులు నిర్వహించే కానిస్టేబుల్​శ్రవణ్ కుమార్ కాజేసినట్లు తేలింది. దీంతో అతన్ని శనివారం రిమాండ్​కు తరలించినట్లు డీసీపీ  పేర్కొన్నారు.