
- రెండ్లేండ్లలో 6.55 లక్షల మందికి కట్
న్యూఢిల్లీ, వెలుగు: పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య ప్రతియేటా తగ్గుతోంది. తెలంగాణ రాష్ట్రంలో 2020–-21లో 36,37,112 మంది లబ్ధిదారులు ఉండగా.. 2021–-22లో 36,53,195 మందికి పెరిగారు. 2022–-23లో 47,83,989 మందికి చేరగా.. 2023–-24లో 44,88,790 మందికి తగ్గారు. 2024-–25 (2024 జులై 22 నాటికి)లో రాష్ట్రంలో లబ్ధిదారులు 41,28,288 మంది ఉన్నారని లోక్సభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
అంటే గడిచిన రెండ్లేండ్లలో 6,55,701 మందికి కోత పెట్టారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఏడాది లబ్ధిదారులను తగ్గిస్తున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. అలాగే, దేశ వ్యాప్తంగా 2021–-22లో 10,79,92, 336 మంది రైతులు పీఎం కిసాన్లో లబ్ధిదారులుగా ఉండగా.. వారికి రూ.67,147.36 కోట్లు రిలీజ్చేశారు. 2022–-23లో లబ్ధిదారుల సంఖ్య 10,74,35,548కి తగ్గగా.. వారికి ఇచ్చే మొత్తం కూడా రూ.58,303.25 కోట్లకు తగ్గింది.
అంటే ఏడాదిలో లబ్ధిదారుల సంఖ్య 5,56,788 కట్ చేశారు. అలాగే, పీఎం కిసాన్ మొత్తం కూడా రూ.8,844.11 కోట్లు కోత పడింది. 2023–-24లో లబ్ధిదారుల సంఖ్య 9,90,30,164కి తగ్గింది. అంటే ఏడాదిలో 84,05,384 మంది లబ్ధిదారులకు పీఎం కిసాన్ ను కట్ చేశారు. ఇక 2024-–25 (2024 జూలై 22 నాటికి)లో లబ్ధిదారుల సంఖ్య 9,25,71,834కి తగ్గింది. అంటే ఈ ఏడాది మరో 64,58,330 లబ్ధిదారులను పీఎం కిసాన్ స్కీమ్నుంచి తొలగించారు. ఇలా దేశ వ్యాప్తంగా 2021--–22 నుంచి 2024--–25 వరకు దాదాపు కోటీ 54 లక్షల మంది ఈ స్కీమ్కు దూరమయ్యారు.