
హైదరాబాద్, వెలుగు: పెండింగ్లో ఉన్న మెస్ చార్జీలు, స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్లను వెంటనే రిలీజ్చేయాలని ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా విభాగం డిమాండ్ చేసింది. సోమవారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ స్టూడెంట్లు ధర్నా నిర్వహించారు. ఇంటర్ స్టూడెంట్లకు మిడ్ డే మిల్స్ అందజేయాలన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే త్వరలో సీఎం క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిసి వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అశోక్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలోని హాస్టల్స్, గురుకులాలు, కేజీబీవీలు, ఆశ్రమ స్కూళ్లకు మెస్ బిల్లులు సుమారు రూ. 6,300 కోట్లు పెండింగులో ఉన్నాయని గుర్తుచేశారు. ఆరేండ్ల నుంచి రాష్ట్రంలో రూ. 7,200 కోట్ల స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్స్ విడుదల కాలేదని తెలిపారు. దీని వల్ల 14 లక్షల మంది స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వసతిగృహాలలో నాణ్యమైన భోజనం, వసతి ఉండట్లేదన్నారు. ఈ సమస్యలన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్ గువేరా, రాష్ట్ర కమిటీ సభ్యురాలు రమ్య, జిల్లా ఉపాధ్యక్షులు నాగేందర్, శ్రీమన్, సునీల్, ప్రశాంత్, స్టాలిన్, భావన, శివ, గణేశ్, రమేశ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.