కంటెయిన్మెంట్ జోన్ల నుంచి వచ్చే వాళ్లకి నో పర్మిషన్
2 గంటల ముందే ఎయిర్పోర్ట్కు చేరుకోవాలి
ఆరోగ్య సేతు మస్ట్.. ‘గ్రీన్’ స్టేటస్ ఉంటేనే అనుమతి
వచ్చే మూడు నెలలకు ధరల ప్రకటన
ఏడు కేటగిరీలుగా జర్నీలు విభజన
25 నుంచి డొమెస్టిక్ విమాన సర్వీసులు
న్యూఢిల్లీ: లాక్డౌన్ వల్ల రెండు నెలలపాటు నిలిచిపోయిన విమాన సర్వీసులు ఈనెల 25 నుంచి షురూ కానున్నాయి. దశలవారీగా డొమెస్టిక్ ఫ్లైట్లను నడపనున్నట్లు కేంద్రం తెలిపింది. ఫ్లైట్ జర్నీకి సంబంధించి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) గురువారం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను రిలీజ్ చేసింది. జర్నీ చేసేవాళ్లు పాటించాల్సిన జాగ్రత్తలు, కొత్త రూల్స్ను అందులో పేర్కొంది. విమానాల్లో ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించేందుకు మధ్య సీట్లను వదిలేస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రకటించింది. అలా సీట్లను ఖాళీగా వదిలేస్తే టికెట్లు పెరిగే అవకాశం ఉందని, దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.
3 నెలలు ఒకే ధరలు
విమాన టికెట్ ధరల గైడ్లైన్స్ను సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ గురువారం రిలీజ్ చేసింది. వచ్చే మూడు నెలల వరకు ఒకే ధరలు ఉంటాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. మే 25 నుంచి ఆగస్టు 24 వరకు ఇప్పుడు నిర్ణయించిన ధరలే అమల్లో ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం డొమెస్టిక్ సర్వీసులపైనే దృష్టిపెట్టామని, ఇంటర్నేషనల్ సర్వీసులు నడపడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
జర్నీ.. ఏడు కేటగిరీలు..
విమాన ప్రయాణాన్ని మొత్తం ఏడు కేటగిరీలుగా విభజించినట్లు అధికారులు చెప్పారు. 0 నుంచి 30 నిమిషాలు.. 30 నుంచి 60 నిమిషాలు, 60 నుంచి 90 నిమిషాలు, 90 నుంచి 120 నిమిషాలు, 120 నుంచి 150 నిమిషాలు, 150 నుంచి 180 నిమిషాలు, 180 నుంచి 210 నిమిషాలు.. ఈ కేటగిరీలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇలా ప్రతి కేటగిరీకి కూడా మినిమమ్, మ్యాగ్జిమమ్ టికెట్ ధరలు నిర్ణయించామన్నారు. ‘‘ఢిల్లీ–ముంబై మినిమమ్ టికెట్ ధర రూ.3,500-గా, మ్యాగ్జిమమ్ ధర రూ.10,000గా నిర్ణయించాం. విమానం సీటింగ్ కెపాసీటీలోని 40 శాతం సీట్లను రూ.6,700 (మినిమమ్, మ్యాగ్జిమమ్ ధరల మిడ్ పాయింట్ కన్నా తక్కువకు) కన్నా తక్కువ ధరకు అమ్మాలి. విమాన సంస్థలు డిమాండ్ ఉందని చెప్పి టికెట్లను మ్యాగ్జిమమ్ రేటుకే అమ్మే అవకాశం ఉంది. అందుకే ఈ రూల్ పెట్టాం. మిగతా రూట్లలో నడిచే విమానాలకు కూడా ఇవే వర్తిస్తాయి” అని వివరించారు. విమానయాన సంస్థలు మెట్రోసిటీల్లో మూడో వంతు కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతిచ్చినట్లు చెప్పారు.
ఇవి పాటించాలి..
ప్యాసింజర్లు రెండు గంటల ముందే ఎయిర్పోర్ట్కు చేరుకోవాలి.
విమానం టైమ్కి 4 గంటల ముందు మాత్రమే ఎయిర్పోర్ట్లోకి అనుమతిస్తారు. అంతకు ముందే వెళ్లి వెయిట్ చేసేందుకు పర్మిషన్ లేదు.
ప్రతి ఒక్కరికి మాస్క్, గ్లౌజ్లు కంపల్సరీ. థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి.
ప్రతి ఒకరి ఫోన్లో ఆరోగ్యసేతు యాప్ ఉండాలి. ఆరోగ్య సేతు యాప్లో గ్రీన్ సిగ్నల్ రాకపోతే వారిని అనుమతించరు. ఆండ్రాయిడ్ ఫోన్ లేని వాళ్లు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి.14 ఏళ్ల లోపు పిల్లలకు ఆరోగ్యసేతు యాప్ అవసరం లేదు.
ఒక్క బ్యాగుకు అనుమతి ఇస్తారు.
ప్యాసింజర్లు, ఎయిర్లైన్స్ సిబ్బంది కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా ప్రైవేట్ ట్యాక్సీలు ఏర్పాటు చేయాలి.
పర్సనల్ వెహికల్స్, సెలెక్టెడ్ క్యాబ్ సర్వీసులను మాత్రమే ఎయిర్పోర్ట్లోకి అనుమతిస్తారు.
ప్రత్యేక సందర్భాల్లో మినహా మిగతా సమయాల్లో ట్రాలీలకు పర్మిషన్ లేదు.
బోర్డింగ్ గేట్ దగ్గర సేఫ్టీ కిట్, మాస్క్, ఫేజ్ షీల్డ్, శానిటైజర్ తీసుకోవాలి.
నో పర్మిషన్
కంటెయిన్మెంట్ జోన్ల నుంచి వచ్చే వారికి, కరోనా పాజిటివ్ వచ్చిన వారికి పర్మిషన్ లేదు.
ఆరోగ్య సేతు యాప్లో రెడ్ స్టేటస్ ఉంటే అనుమతి ఇవ్వరు.
‘నాట్ ఫర్ యూజ్’ అని రాసిన చైర్లలో కూర్చోరాదు
భోజనం పెట్టరు. ప్యాసింజర్లు కూడా ఫుడ్ తీసుకురాకూడదు. ప్రతి సీట్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి.
ముసలివాళ్లు, ప్రెగ్నెంట్లు, ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు ఎయిర్ట్రావెల్ను వాయిదా వేసుకోవాలి.