న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దక్షిణ కొరియా సంస్థ శామ్సంగ్ కన్స్ట్రక్షన్ అండ్ ట్రేడింగ్ కార్పొరేషన్ (సీ అండ్ టీ) నుంచి రూ.27.600 కోట్ల (3 బిలియన్ డాలర్ల) విలువైన ఆర్డర్ దక్కించుకుంది. గ్రీన్ అమ్మోనియాను 15 ఏళ్ల పాటు సప్లయ్ చేయడానికి లాంగ్టర్మ్ ఒప్పందం కుదుర్చుకుంది.
రిలయన్స్కు చెందిన న్యూ ఎనర్జీ బిజినెస్ జామ్నగర్ (గుజరాత్) లో అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ సోలార్ మాడ్యూల్స్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, ఎలక్ట్రోలైజర్స్, హైడ్రోజన్, అమ్మోనియాను తయారు చేస్తోంది.
తాజా ఒప్పందం ప్రకారం, 2028–29 ఆర్థిక సంవత్సర చివరి నుంచి సరఫరా ప్రారంభమవుతుంది. గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో రెన్యూవబుల్ కరెంట్ను వాడతారు. అమ్మోనియాను ఎరువులు, పరిశ్రమల రసాయనాలు, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారు. అనంత్ అంబానీ మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం భారతదేశాన్ని గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఇంధనాలకు గ్లోబల్ హబ్గా నిలబెడుతుందని అన్నారు.