టెలికం మార్కెట్లో దూసుకెళ్తున్న రిలయన్స్ జియో దూకుడుకి బ్రేక్ పడింది. కిందటేడాది డిసెంబర్లో 1.28 కోట్ల మంది సబ్స్క్రయిబర్లను ఈ కంపెనీ పోగొట్టుకుంది. వీ కూడా కస్టమర్లను పోగొట్టుకోగా, భారతి ఎయిర్టెల్మాత్రం కొత్త కస్టమర్లను పోగేసుకుంది. డిసెంబర్ 2021 డేటాను గురువారం నాడు ట్రాయ్(టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) రిలీజ్ చేసింది. డిసెంబర్లో కస్టమర్లు తగ్గిపోవడంతో రిలయన్స్ జియో మొత్తం కస్టమర్ల సంఖ్య 41.57 కోట్లకు పరిమితమయ్యారు. కిందటేడాది డిసెంబర్లో మరో టెలికం ఆపరేటర్ వీ కూడా 16.14 లక్షల మంది కస్టమర్లను పోగొట్టుకుంది. దీంతో ఆ కంపెనీ సబ్స్క్రయిబర్ల సంఖ్య 26.55 కోట్లకు పడిపోయింది. ఇదే నెలలో ఎయిర్టెల్ మాత్రం తన కస్టమర్ల సంఖ్యను మరో 4.75 లక్షలు పెంచుకుంది. దీంతో ఆ కంపెనీ మొత్తం కస్టమర్లు 35.57 కోట్లకు పెరిగారు.
మార్కెట్వాటాలో ఇంకా టాపే...
ఓవరాల్ మార్కెట్ వాటాలో మాత్రం రిలయన్స్ జియోనే ఇంకా టాప్లో ఉంది. 2021 డిసెంబర్ నాటికి ఈ కంపెనీ మార్కెట్ వాటా 36 శాతం. 30.83 శాతం మార్కెట్ వాటాతో ఎయిర్టెల్ రెండో ప్లేస్లో ఉండగా, 23 శాతంతో వీ మూడో ప్లేస్లో నిలిచింది. డిసెంబర్ 2021లో రూరల్ ఏరియాలలో జియో కస్టమర్లు 17.99 కోట్ల మందికి తగ్గిపోయారు. ఎయిర్టెల్ రూరల్ కస్టమర్ల సంఖ్య 17.01 కోట్లకు, వీ రూరల్ కస్టమర్ల సంఖ్య 13.43 కోట్లకు పడిపోయింది. ఆసక్తికరమైన పరిణామమేమంటే తక్కువ ఖర్చు పెట్టే కస్టమర్లను రిలయన్స్ జియో వదిలించుకుంటోందనేది. ఏవరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఏఆర్పీయూ) పెంచుకునే దిశలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న టెలికం కంపెనీలు అందుకోసం టారిఫ్లను పెంచుతున్నాయి. దీంతో అంత ఖర్చు పెట్టలేని కస్టమర్లు ఆయా నెట్వర్క్లను వీడుతున్నారు.