- ఏజీఎంతో రిలయన్స్ షేర్లు డౌన్
- 2 రోజుల్లో మార్కెట్ క్యాప్
- రూ.1.3 లక్షల కోట్లు తగ్గింది
- భవిష్యత్ గురించి బాధ అవసరం లేదంటున్న ఎనలిస్టులు
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) గురువారం నిర్వహించిన ఏజీఎంలో భారీ ప్రకటనలే చేసినా కంపెనీ షేర్లు మాత్రం నష్టపోతూనే ఉన్నాయి. గత రెండు సెషన్లలో రిలయన్స్ మార్కెట్ క్యాప్ విలువ దాదాపు రూ .1.30 లక్షల కోట్లు తగ్గింది. బీఎస్ఈలో శుక్రవారం రిలయన్స్ షేర్లు 2.8 శాతం నష్టపోయి రూ .2,093.20 వద్ద ముగిశాయి. గత నాలుగు సెషన్లలో ఈ స్టాక్ దాదాపు 6.45శాతం నష్టపోయింది. ‘‘ఎనలిస్టులు ఊ హించినట్లుగానే స్మార్ట్ఫోన్ను కూడా అంబానీ ప్రకటించారు. సౌదీ ఆయిల్ కంపెనీ ఆరామ్కో చైర్మన్ ను రిలయన్స్ బోర్డులోకి తీసుకున్నారు. అయితే ఓ2సీలో వాటా అమ్మకం పనులు పూర్తి కాలేదు. వాట్సాప్–-జియోమార్ట్ ఒప్పందం గురించి ఏమీ చెప్పలేదు. జియో/ రిటైల్ ఐపీఓలపై సమాచారం ఇవ్వలేదు’’ అని జీపీ మోర్గన్ తన ఇన్వెస్టర్లకు పంపిన నోట్ పేర్కొంది. గత ఆరు వారాలుగా స్టాక్ ధర తగ్గుతూనే ఉందని, ఇక ముందు కూడా నష్టాలు కొనసాగినా ఆశ్చర్యం లేదని ఎనలిస్టులు అంటున్నారు. మరికొందరు ఎనలిస్టులు మాత్రం రిలయన్స్ కంపెనీలకు ఢోకా ఉండదని అంటున్నారు.
ఇబిటాలో మార్పులు ఉండకపోవచ్చు
‘‘రిలయన్స్ ఇబిటాపై మా అంచనాలు పెద్దగా మారలేదు. ఈ ఆర్థిక సంవత్సరం తక్కువ పన్ను రేటు ఉండొచ్చు. అందుకే ఈపీఎస్ 14 శాతం ఎక్కువ ఉంది. రిఫైనింగ్ బిజినెస్ బలహీనంగా ఉంది. పెట్రోకెమికల్ వ్యాపారం మాత్రం బలంగా ఉంది. టెలికం టారిఫ్ పెరిగింది. జీఆర్ఎం రికవరీ చాలా ముఖ్యం’’ అని జేపీ మోర్గాన్ రిపోర్టు వివరించింది. క్లీన్ ఎనర్జీ తయారీ కోసం రూ.75 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ఏజీఎంలో కంపెనీ ప్రకటించింది. ఆయిల్- టు -కెమికల్స్ వ్యాపారంలో 20శాతం వాటాను సౌదీ అరామ్కోకు 2021 చివరి నాటికి ఇస్తామని పేర్కొంది. ఈ కంపెనీ చైర్మన్ యాసిర్ అల్-రుమయ్యన్ రిలయన్స్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్గా చేరతారు. ‘‘కొత్త ఎనర్జీ, మెటీరియల్స్ ఎకోసిస్టమ్ను నిర్మించడం సులువు కాదు. ఇందుకోసం ఓ2సీ బిజినెస్లో మార్పులు చేయాలి. క్యాపెక్స్ మరింత పెరుగుతుంది. అయినప్పటికీ రిలయన్స్ కు మంచి భవిష్యత్ ఉండొచ్చు. షేర్లను కొనొచ్చు. ఇక నుంచి కూడా ‘బయ్’ రేటింగును కొనసాగిస్తాం’’ అని బోఫా సెక్యూరిటీస్ పేర్కొంది.
క్లీన్ టెక్తో రిలయన్స్ మేలే
క్లీన్టెక్, డీకార్బనైజేషన్పై ఫోకస్ చేయడం వల్ల రిలయన్స్కు అద్భుత అవకాశాలు ఉంటాయని బ్రోకరేజీ కంపెనీలు చెబుతున్నాయి. రిన్యువబుల్ ఎనర్జీ సెక్టార్తో భారీగా లాభాలను సంపాదించవచ్చని, కొన్నేళ్ల తరువాత సాధారణ కరెంటు ఫ్యాక్టరీలతో లాభాలు ఉండబోవని జెఫరీస్ అంచనా వేసింది. క్లీన్ ఎనర్జీ వల్ల రిలయన్స్ మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటుందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. సోలార్ పవర్ కంపెనీలకు గవర్నమెంటు ఎన్నో ఇన్సెంటివ్లు ఇస్తోందని, సోలార్ ఫొటోవోల్టోయిక్ బిజినెస్ల ద్వారా రిలయన్స్కు ప్రయోజనాలు ఉంటాయని కోటక్ సెక్యూరిటీస్ తెలిపింది. రిలయన్స్ ఎనర్జీ స్టోరేజీ ప్లాంట్లకు పీఎల్ఐ స్కీము ద్వారా ఇన్సెంటివ్స్ వస్తాయని హెచ్ఎస్బీసీ తెలిపింది. గ్రీన్, క్లీన్ ఎనర్జీని తయారు చేసేందుకు రూ. 75 వేల కోట్లను ఖర్చు చేస్తామని ఏజీఎంలో ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. గుజరాత్లోని జామ్నగర్లో 5 వేల ఎకరాలలో అతిపెద్ద ధీరూబాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నిర్మాణ పనులను మొదలుపెట్టామని, సోలార్ ఎనర్జీని తయారు చేసే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ఇదేనని పేర్కొన్నారు. బ్యాటరీల తయారీ ప్లాంట్ను, ఫ్యూయల్ సెల్స్ను తయారు చేసే ప్లాంట్లను, గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రోలైజర్ ప్లాంట్ను కూడా నిర్మిస్తామని రిలయన్స్ ప్రకటించింది.