
- సీఎస్ స్పందించి చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లతో పాటు పలు సోషల్ మీడియా హ్యాండిల్స్లో ముఖ్యమైన సమాచారం తొలగిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయంలో సీఎస్ శాంతి కుమారి తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేటీఆర్ మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ‘‘2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్లోని ముఖ్యమైన సమాచారం కనిపించకుండా చేశారు.
కొన్ని ముఖ్యమైన వెబ్సైట్లను పూర్తిగా తొలగించారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రారంభంలో మెయింటెనెన్స్ ఇష్యూ పేరిట ప్రముఖ సైట్లను ప్రజలకు దూరంగా ఉంచారు. కానీ, ఇది ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు అనిపిస్తున్నది. ఈ వెబ్సైట్ల నుంచి ముఖ్యమైన సమాచారం అదృశ్యం కావడం, కొన్ని వెబ్సైట్లు మాయం కావడం వెనక పాలకుల హస్తం ఉండొచ్చు.
2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ సీఎంగా పరిపాలన కొనసాగించారు. కేసీఆర్ పాలనకు సంబంధించిన వేల ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారు. ముఖ్యమైన సమాచారాన్ని భద్రపర్చాలి కానీ, ఇలా తొలగించడం సరికాదు.”అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.