హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్ ప్రాజెక్టులోని ఒకటి, రెండో స్పిల్ వే గేట్ల వద్ద గర్డర్ బ్రిడ్జి కవర్ పాడైందని, దానికి వీలైనంత త్వరగా రీఇన్ఫోర్స్మెంట్ చేయాలని అధికారులకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) సూచించింది. ఈ మేరకు శుక్రవారం నాగార్జునసాగర్ సేఫ్టీపై ఎన్డీఎస్ఏ రిపోర్ట్ విడుదల చేసింది. ప్రాజెక్టులోని పలు పియర్లలోని కౌంటర్ వెయిట్ల వద్ద క్రాక్స్ వచ్చాయని ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని పియర్లలోని క్రాక్స్ను మ్యాప్ చేసి, విశ్లేషించి చర్యలు తీసుకోవాలని చెప్పింది. ప్రాజెక్టు నిండి స్పిల్ వే మీద నుంచి వరద వెళ్లేంత స్థాయిలో ఉంటే ఓసారి జెడ్ సీల్స్ను చెక్ చేయాలని పేర్కొంది. కొన్ని స్పిల్ వేల్లోని గ్లేసిస్ల వద్ద బ్లాక్ అవుట్స్ ఉన్నాయని, వాటిని మంచి గ్రేడ్ కాంక్రీట్తో పూడ్చాలని సూచించింది.
చాలా వరకు స్పిల్ వేల్లోని రంధ్రాలను పూడ్చివేశారని, మరికొన్ని స్పిల్ వేల్లోనూ సమస్యలున్నాయని, వాటి పనులనూ వర్షాకాలంలోపే పూర్తి చేయాలని స్పష్టం చేసింది. స్పిల్ వే కింది భాగంలోని ఫ్లిప్ బకెట్ల వద్ద కాంక్రీట్ కొట్టుకుపోయిందని, వాటికి రిపేర్లు చేయాలని సూచించింది. 250 అడుగులు, 420 అడుగుల వద్ద ఇన్స్పెక్షన్ గ్యాలరీల్లోని వీ నాచ్ ల ద్వారా సీపేజీ వస్తున్నదని.. ఆ రెండు సీపేజీలు ఎంత మేర ఉన్నాయో విడివిడిగా లెక్కించాలని ఎన్డీఎస్ఏ టీమ్సూచించింది. గ్యాలరీలోని రెసిస్టెన్స్ థర్మో మీటర్, ప్లంబ్ లైన్, స్ట్రెస్ మీటర్, అప్లిఫ్ట్ ప్రెజర్ సెల్స్ అసలు పనిచేయడం లేదని వెల్లడించింది. ఇంత పెద్ద డ్యామ్ను మానిటరింగ్ చేయడంలో ఈ పరికరాలు కీలకమని, వాటిని వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సూచించింది. అలాగే ప్రాజెక్ట్ భద్రతపై ఓ సారి సమగ్రంగా విశ్లేషించాల్సిన అవసరం ఉందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో పేర్కొంది.
అడ్డుకుంటున్నరని ఫిర్యాదులు
పనులను పర్యవేక్షించేందుకు వెళ్తున్న అధికారులను కేఆర్ఎంబీ, సెక్యూరిటీ ఏజెన్సీలు అడ్డుకుంటున్నాయంటూ డ్యామ్ ఇన్స్పెక్షన్ సందర్భంగా తమకు ఫిర్యాదులు వచ్చాయని ఎన్డీఎస్ఏ తెలిపింది. ఇలా అడ్డుకోవడం వల్ల ప్రాజెక్టు పనులకు ఆటంకం కలగడంతో పాటు ప్రాజెక్ట్ ఆపరేషన్స్ అండ్ మానిటరింగ్కు తీవ్ర ఇబ్బంది అవుతుందని రిపోర్ట్లో పేర్కొంది. అధికారులకు ప్రాజెక్ట్పైకి వెళ్లి పనులను పరిశీలించేలా అనుమతులివ్వాలని పేర్కొంది. ప్రాజెక్ట్కు వచ్చే ప్రాబబుల్ మ్యాగ్జిమమ్ ఫ్లడ్ (పీఎంఎఫ్)పై ఐఐటీ ఖరగ్పూర్ రిపోర్ట్మేరకు చర్యలు తీసుకోవాలని సూచించింది.