- ప్రారంభించనున్న కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సెక్రటరీ అల్కేష్ కుమార్
- ఇక త్రీడీ ప్రింటింగ్టెక్నాలజీలో మరిన్ని పరిశోధనలు
- మెడికల్ ఇంప్లాంట్స్తయారీతో మెరుగైన వైద్య సేవలు
సికింద్రాబాద్, వెలుగు: త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో మెడికల్ ఇంప్లాంట్స్(వైద్య పరికరాలు) తయారీలో మరిన్ని పరిశోధనలకు వీలుగా ఉస్మానియా వర్సిటీలో రీసెర్చ్సెంటర్ అందుబాటులోకి రానుంది. ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటైన నేషనల్ సెంటర్ ఫర్ ఆడిటివ్మ్యానుఫ్యాక్చరింగ్(ఎన్ సీఏఎం)ను గురువారం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సెక్రటరీ అల్కేష్కుమార్, రాష్ట్ర ఐటీ శాఖ సెక్రటరీ జయేశ్రంజన్, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ ప్రారంభించనున్నారు. ఈ సెంటర్ అందుబాటులోకి వస్తే ఇంజనీరింగ్ స్టూడెంట్లు మరిన్ని రీసెర్చ్లు చేసేందుకు ఉపయోగకరంగా ఉంటుందని వర్సిటీ అధికారులు చెబుతున్నారు.
గతేడాది అవగాహన ఒప్పందం
ఉస్మానియా వర్సిటీలో ఎన్సీఏఎం సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖతో 2022 మే నెలలో అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం కేంద్ర ప్రభుత్వ రూసా(రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్) నిధులతో ఈ సెంటర్ను డెవలప్ చేశారు. దీనిని ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న త్రీడీ సెంటర్కు లింక్ చేసి త్రీడీ టెక్నాలజీ వాడకంపై మరిన్ని రీసెర్చ్లు చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.
ఎన్నో ప్రయోజనాలు
వైద్యరంగంలో మెడికల్ ఇంప్లాంట్స్లో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ టెక్నాలజీతో తయారు చేసిన వైద్య పరికరాలతో పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు. ఓ వ్యక్తి ప్రమాదానికి గురైనప్పుడు లేదా ఇతర వ్యాధుల వల్ల అతడి శరీరంలోని ఎముకలను కోల్పోయే పరిస్థితి ఎదురైతే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో తయారు చేసిన ఎముకలను ఆయా భాగాల్లో డాక్టర్లు అమర్చేందుకు వీలుంటుంది. దీంతోపాటు గుండెకు సంబంధించిన సర్జరీలు, ఇతర ట్రీట్మెంట్లకు సైతం త్రీడీ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. ఎన్సీఏఎంతో కలిసి త్రీ-డీ ప్రింటింగ్టెక్నాలజీ సెంటర్తో రీసెర్చ్ చేయడంతో పేదలకు అతి తక్కువ ధరకు వైద్య సేవలు అందించేందుకు వీలుంటుందని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఆటో మొబైల్, స్పేస్ రంగంతోపాటు ఇతర ఇండస్ట్రీల్లోనూ ఈ టెక్నాలజీ సాయంతో ఉత్పత్తుల తయారీ టైమ్ను తగ్గించవచ్చన్నారు.
స్టార్టప్ల ఏర్పాటుకు అవకాశం
ఎన్సీఏఎం సెంటర్ అందుబాటులోకి వస్తే ఉస్మానియా వర్సిటీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతుందని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు. త్రీడీ ప్రింటింగ్ పరికరాలపై అవగాహన కార్యక్రమాలు, ఇంటర్నేషనల్ సెమినార్లు, ట్రైనింగ్ ప్రోగ్రామ్లు నిర్వహించేందుకు, ఇంటర్న్ షిప్, స్టార్టప్ల ఏర్పాటుకు మెరుగైన అవకాశాలుంటాయని అధికారులు చెబుతున్నారు.
ఇంజనీరింగ్ స్టూడెంట్లకు మంచి చాన్స్
త్రీ-డీ ప్రింటింగ్టెక్నాలజీపై 14 ఏండ్లుగా రీసెర్చ్లు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. రెండేండ్ల కిందట ఉస్మానియాలో త్రీడీ ప్రింటింగ్ ల్యాబ్ ప్రారంభమైంది. అందుబాటులోకి రానున్న ఎన్సీఏఎంతో ఇంజనీరింగ్ స్టూడెంట్లకు వివిధ అంశాలలో రీసెర్చ్లు చేసేందుకు మంచి అవకాశం ఉంది. – ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్, ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్, త్రీడీ ప్రింటింగ్ సెంటర్ డైరెక్టర్