- ఆర్టికల్32 ప్రాథమిక హక్కులకు సంబంధించింది
- దాని కింద రిజర్వేషన్ల అంశాన్ని విచారించలేం
- తమిళనాడులో మెడికల్ సీట్ల ఓబీసీ కోటా అంశంలో సుప్రీం
న్యూఢిల్లీ: రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని, ప్రస్తుతం ఉన్న చట్టాలు అదే చెపుతున్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు మెడికల్కాలేజీల్లో ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కామెంట్ చేసింది. తమిళనాడులోని మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఆల్ ఇండియా కోటాలో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం లేదంటూ సీపీఐ, డీఎంకే సహా పలు పార్టీల నేతలు సుప్రీంకోర్టులో పలు పిటిషన్లను దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్లను జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని బెంచ్ విచారించింది.
ఆర్టికల్ 32 వర్తించదు..
తమిళనాడులో ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలకు 69 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, ఇందులో ఓబీసీలకు 50 శాతం కేటాయించారని పిటిషనర్లు కోర్టుకు చెప్పారు. 2020–21 సంవత్సరానికిగానూ కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లు మినహా మిగతా మెడికల్, డెంటల్ కాలేజీల్లో పీజీ, డిగ్రీ కోర్సుల్లో ఆలిండియా కోటా కింద ఓబీసీలకు కచ్చితంగా 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఓబీసీ క్యాండిడేట్లకు అడ్మిషన్లు నిరాకరించడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని, అందువల్ల రిజర్వేషన్లు కల్పించే వరకూ నీట్ కౌన్సెలింగ్పై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ల వాదనతో బెంచ్ సంతృప్తి చెందలేదు. ఆర్టికల్32 అనేది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు సంబంధించినదని, దాని కింద రిజర్వేషన్ల పిటిషన్లను విచారించలేమని స్పష్టం చేసింది. రిజర్వేషన్లను ప్రాథమిక హక్కుగా ఎవరూ చెప్పలేరని, రిజర్వేషన్లు కల్పించకపోవడాన్ని రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన కింద పరిగణించలేమని బెంచ్ స్పష్టం చేసింది. తమిళనాడు ప్రజల ప్రాథమిక హక్కుల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి రావడం ఆహ్వానించదగినదని, అయితే రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని, అందువల్ల ఈ పిటిషన్లను అనుమతించలేమని స్పష్టం చేసింది. పిటిషన్లను వెనక్కి తీసుకునేందుకు అనుమతిచ్చిన కోర్టు.. రిజర్వేషన్ల చట్టాల ఉల్లంఘనపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషన్లకు సూచించింది.
మహారాష్ట్ర సర్కారుకు సుప్రీం నోటీసులు
మహారాష్ట్రలోని పాల్ఘర్లో సాధువుల హత్యపై సీబీఐ, ఎన్ఐఏతో వేర్వేరుగా దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు అనుమతించింది. ఈ పిటిషన్లపై స్పందన తెలియజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అశోక్ భూషణ్ ఆధ్వర్యంలోని బెంచ్.. మహారాష్ట్ర సర్కారు, ఆ రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై రెండో వారానికి వాయిదా వేసింది. ఏప్రిల్లో పాల్ఘర్ ప్రాంతంలో ఇద్దరు సాధువులతో పాటు వారి డ్రైవర్ను దుండగులు హత్య చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఈ కేసుకు సంబంధించి వంద మందికిపైగా పోలీసులు అరెస్ట్ చేశారు