క్రెడిట్​ హిస్టరీ లేకున్నా అప్పు.. ఆర్​బీఐ కొత్త డిజిటల్​ ప్లాట్​ఫామ్​

క్రెడిట్​ హిస్టరీ లేకున్నా అప్పు.. ఆర్​బీఐ కొత్త డిజిటల్​ ప్లాట్​ఫామ్​
  • రెపో రేటు మూడోసారీ మార్చలే
  • సిస్టమ్​లో లిక్విడిటీ తగ్గించడానికి  సీఆర్​ఆర్​ పెంపు 
  • జీడీపీ గ్రోత్​ అంచనాలు యధాతథం
  • ఇన్​ఫ్లేషన్ అంచనా 5.40 శాతానికి మార్పు

వెలుగు బిజినెస్​ డెస్క్​: క్రెడిట్​ హిస్టరీ లేకపోయినా అప్పులు తీసుకోవడానికి వీలు కల్పించే ఇన్నోవేటివ్​ సిస్టమ్​ను రిజర్వ్​ బ్యాంక్​  ఆఫ్​ ఇండియా తీసుకురానుంది.  రైతులైనా, చిన్న వ్యాపారులైనా తొందరగా అప్పులు పొందేలా ఒక కొత్త డిజిటల్​ ప్లాట్​ఫామ్​ను డెవలప్​ చేస్తున్నట్లు క్రెడిట్​ పాలసీ ప్రకటన సందర్భంగా ఆర్​బీఐ  గవర్నర్​ శక్తికాంత దాస్ ​వెల్లడించారు. సాఫీగా అప్పులు పొందేలా ఈ ప్లాట్​ఫామ్​ ఉంటుందని, దీనిని రిజర్వ్​ బ్యాంక్​ ఇన్నోవేషన్​​ హబ్​ డెవలప్​ చేస్తోందని చెప్పారు.  కిసాన్​ క్రెడిట్​ కార్డు (కేసీసీ)పై అప్పులు ఇచ్చేందుకు ఒక పైలట్​ ప్రాజెక్టును ఆర్​బీఐ, ఆర్​బీఐ ఇన్నోవేషన్​ హబ్​లు చేపట్టాయి. మధ్యప్రదేశ్​, తమిళనాడు, కర్నాటక, యూపీ, మహారాష్ట్రలలోని కొన్ని జిల్లాలలో ఈ పైలట్​ ప్రాజెక్టు ఇప్పటికే నడుస్తోంది. ఈ పైలట్​ ఆధారంగా ఇప్పుడు కొత్త పబ్లిక్​ టెక్ ​ప్లాట్​ఫామ్​ డెవలప్​ చేయనున్నారు. రైతులు, డెయిరీ ఫార్మ్​లు నడిపే వారిలో చాలా మందికి  క్రెడిట్​ హిస్టరీ లేకపోవడంతో అప్పులు పుట్టడం కష్టమవుతోంది. లెండింగ్​లో ఇదొక ఓఎన్​డీసీ లాంటి ఇన్నోవేషన్​గా ఆర్​బీఐ చెబుతోంది. మరోవైపు యూపీఐ లైట్‌తో చేసే ట్రాన్సాక్షన్ల  లిమిట్‌ను ప్రస్తుతం ఉన్న రూ.200 నుంచి 500 కి ఆర్‌‌బీఐ పెంచింది. 

లిక్విడిటీ తగ్గింపుపై ఫోకస్‌

సిస్టమ్​లో లిక్విడిటీ తగ్గించే లక్ష్యంతో  క్యాష్​రిజర్వ్​ రేషియో (సీఆర్​ఆర్​)ను ఇంక్రిమెంటల్​గా 10 శాతం ఆర్​బీఐ పెంచింది. దీంతో సిస్టమ్​నుంచి దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఆర్​బీఐ వద్దకు చేరుతాయి. ఇప్పుడున్న పరిస్థితులలో ఇదే సరైన ఆప్షన్​గా ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ చెప్పారు. అప్పులు ఇవ్వడానికి తగినంత డబ్బు బ్యాంకుల వద్ద ఉందని,  ఆ లిక్విడిటీ సరిపోతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. మరోవైపు రెపో రేటును 6.50 శాతం వద్దే కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ మెంబర్లందరూ ఏకగ్రీవంగా నిర్ణయించారు. సీఆర్​ఆర్​ పెంపు ఈ ఏడాది సెప్టెంబర్​ 8 దాకా అమలులో ఉంటుందని దాస్​ వెల్లడించారు.

 జూన్​ 2022 నుంచి చూస్తే ఈ ఏడాది ఆగస్టు 14 నాడు సిస్టమ్​లో అత్యధికంగా రూ. 2.48 లక్షల కోట్ల అదనపు లిక్విడిటీ ఉన్నట్లు డేటా చెబుతోంది. తాజా డేటా ఆధారంగా సెప్టెంబర్​ 8 న సీఆర్​ఆర్ ​పెంపును రివ్యూ చేయనున్నట్లు ఎంపీసీ డిపార్ట్​మెంట్​ హెడ్, ఆర్​బీఐ డిప్యూటీ గవర్నర్​ మైఖేల్​ పాత్ర చెప్పారు. కూరగాయల రేట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ధరల కట్టడి కోసం తగిన చర్యలు తీసుకోవల్సి ఉంటుందని, అవసరమైతే వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తుందని దాస్​ పేర్కొన్నారు. జియో పొలిటికల్​ టెన్షన్లు కొనసాగుతున్నాయని, మరోవైపు వాతావరణ పరిస్థితుల వల్లా ఇబ్బందులెదురవుతున్నాయని దాస్ అన్నారు. ఇన్‌ఫ్లేషన్‌ సమస్యలు ఇంకా ముగిసిపోలేదని చెప్పారు. మార్కెట్​ నుంచి రూ. 2 వేల నోటును విత్​డ్రా చేయడంతో లిక్విడిటీ భారీగా పెరగడానికి ఒక కారణమైందని చెబుతూ, 90 శాతం రూ. 2 వేల నోట్లు (రూ. 3.60 లక్షల కోట్లు) వెనక్కి వచ్చేశాయని దాస్​ వెల్లడించారు.

జీడీపీ గ్రోత్​ అంచనాలు మారలే....

2023–24 ఫైనాన్షియల్​ ఇయర్​కు గతంలో ఇచ్చిన జీడీపీ గ్రోత్​ అంచనాలలో ఆర్​బీఐ ఎలాంటి మార్పులూ చేయలేదు. ముందు చెప్పినట్లుగానే జీడీపీ గ్రోత్​ 6.5 శాతంగా ఉంటుందని పేర్కొంది. డిమాండ్​ పరిస్థితులు సజావుగానే కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా తెలిపింది.

ఎలాంటి సమస్యలూ ఉండవు..

సీఆర్​ఆర్​ పెంపు వల్ల ప్రజలకు లేదా ఇండస్ట్రీ రంగాలకు ఎలాంటి సమస్యలూ ఎదురుకావని దాస్​ హామీ ఇచ్చారు. పండగ సీజన్​ ఖర్చులకు లిక్విడిటీ కొరత ఏర్పడదని, అలాగే సెప్టెంబర్​ నెలలో అడ్వాన్స్​  ట్యాక్స్​,  జీఎస్​టీ చెల్లించడానికి వ్యాపార వర్గాలకూ ఎలాంటి ఇబ్బందీ ఉండదని పేర్కొన్నారు. అంతర్గతంగా అన్ని లెక్కలు చూశాకే  ఈ నిర్ణయానికి ఆర్​బీఐ వచ్చిందన్నారు. ఆ లెక్కల ప్రకారం సిస్టమ్​లో తగినంత లిక్విడిటీ ఉంటుందని తేలిందని స్పష్టం చేశారు. రెపో రేటు మార్చకుండా వదిలేయడం వరసగా ఇది మూడోసారి. ఫుడ్​ ఐటమ్స్​ రేట్లు పెరుగుదల ఆగకపోతే వడ్డీ రేట్ల పెంపు తప్పకపోవచ్చని గవర్నర్​ శక్తికాంత దాస్​ వార్నింగ్​ ఇచ్చారు. హెడ్​లైన్​ ఇన్​ఫ్లేషన్​ 4 శాతం కింద నిలకడగా ఉండాలని, ఆర్​బీఐ ఇదే ఫోకస్​తో పనిచేస్తోందని చెప్పారు. ఒకవేళ ఇన్​ఫ్లేషన్​ పెరిగితే కఠిన చర్యలు తీసుకోవడం తప్పనసరవుతుందని పేర్కొన్నారు. ఫుడ్​ ఐటమ్స్​ రేట్ల పెరుగుదల దృష్ట్యా  ఇన్​ఫ్లేషన్​ అంచనాలను ఆర్​బీఐ సవరించింది. ఇంతకు ముందు 5.1 శాతంగా ఉన్న అంచనాను తాజాగా 5.4 శాతానికి ఆర్​బీఐ పెంచింది.