
పదేళ్ల బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అవినీతి అక్రమాలు రోజుకోటి బయటపడుతున్నాయి. ప్రభుత్వంలోని పలు శాఖల్లో భారీగా బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు విచారణలో బయటపడింది. బోగస్ ఉద్యోగుల పేరుతో నెలనెల జీతాలు తీసుకుంటూ వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్లు తేలింది.
ప్రభుత్వ విభాగాలు, పలు శాఖల్లో దాదాపు లక్ష మంది బోగస్ ఉద్యోగులున్నట్లు గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం. వీరి వల్ల ఏటా రూ.1500 కోట్ల జీతాలు దుబారా అయ్యాయని అంచనాకు వచ్చింది. గడిచిన పదేండ్లలో బోగస్ ఉద్యోగుల పేరిట రూ.15 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండిపడింది. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు, కాంట్రాక్టు మ్యాన్ పవర్ కంపెనీలు ఏర్పాటు చేసిన కొందరు నాయకులు, బడాబాబులు ఇదంతా దోచుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో బోగస్ ఉద్యోగుల జీతాలు అక్టోబర్ నుంచి నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మాజీ సీఎస్ శాంతి కుమారి ఆధ్వర్యంలో వేసిన త్రిసభ్య కమిటీ రిపోర్టులో ఈ వాస్తవాలు బయటపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు తేల్చిన కమిటీ..అందులో కేవలం రెండు లక్షల మంది పూర్తిస్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. సెప్టెంబర్ 30 వరకు సగం మంది ఉద్యోగులు మాత్రమే బ్యాంక్ ఖాతాలు, ఆధార్ వివరాలు ఇచ్చారు. మిగిలిన వారు అక్టోబర్ 25 వరకు ఆధార్ వివరాలివ్వాలని కమిటీ ఆదేశాలు జారీ చేసింది.