
ఇబ్రహీంపట్నం, వెలుగు: ఫామ్హౌస్, రిసార్ట్ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి హెచ్చరించారు. ఇబ్రహీంపట్నంలో ఫామ్ హౌస్, రిసార్ట్ యజమానులతో శుక్రవారం ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీలు, ఫంక్షన్లకు తప్పనిసరిగా అనుమతులు ఉండాలన్నారు. ఫామ్హౌస్, రిసార్ట్ మొత్తం కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈవెంట్లు, పార్టీల్లో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ఊరుకోబోమన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, సీఐలు మహేందర్ రెడ్డి, రవికుమార్, నందీశ్వర్ రెడ్డి, సత్యనారాయణ, మాడుగుల వేణుగోపాల్ పాల్గొన్నారు.