ఢిల్లీ: మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు కీలక రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత రిటైల్ ఇంధన ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని 'ఇండియా ఫ్యూయల్ రిటైల్'పై మాక్వారీ గ్రూప్ తన నివేదికలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ధరలు స్తంభించిపోవడంతో.. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు పెట్రోల్పై లీటరుకు రూ.18, డీజిల్పై లీటరుకు రూ.35 నష్టపోతున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
ఏప్రిల్లో జరిగే ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు పెరిగే ప్రమాదం కనిపిస్తోందని మాక్వారీ గ్రూప్ ఆందోళన వ్యక్తం చేసింది. ముడి చమురుపై బ్యారెల్కు పెరిగే ప్రతీ 10 డాలర్లకు, మార్కెటింగ్ నష్టాలకు లీటరుకు సుమారుగా 6 రూపాయలు అదనంగా చేరుతుందని ఆ నివేదిక తెలిపింది. మార్చిలో ప్రభుత్వం ఇంధనాలపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 10 రూపాయలు తగ్గించిన సంగతి తెలిసిందే. కేంద్ర పన్నులు తగ్గుముఖం పడుతూ ప్రస్తుతం పెట్రోల్పై లీటరుకు 11.9 రూపాయలు, డీజిల్పై లీటరుకు 7.8 రూపాయలకు కేంద్ర పన్నులు చేరాయి.
ఎక్సైజ్ సుంకాలను పూర్తిగా తొలగించినప్పటికీ.. ప్రస్తుత ధరల వల్ల ఓఎంసీ నష్టాలను పూర్తిగా భర్తీ చేయలేదని నివేదిక స్పష్టం చేసింది. దాదాపు పదేళ్ల క్రితమే ఇంధన ధరల నియంత్రణను సడలించినప్పటికీ.. ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) , భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పిసిఎల్) ఏప్రిల్ 2022 నుంచి... రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరల్లో భారీ మార్పులుచేర్పులు చేయకపోవడం గమనార్హం.
►ALSO READ | సిటియస్ ట్రాన్స్నెట్ ఐపీఓ ఈ నెల 17న..
కానీ.. పశ్చిమాసియాలో నెలకొన్న ఇంధన సంక్షోభం ప్రభావంతో 2026 ఏప్రిల్ తర్వాత మన దేశంలో ఇంధన రిటైల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని మాక్వారీ గ్రూప్ తెలిపింది. 2025లో మన దేశ ముడి చమురు అవసరాలు 88 శాతం దిగుమతి చేసుకోవడం ద్వారా తీరినవే కావడం గమనార్హం. ఈ దిగుమతులలో సుమారు 45 శాతం పశ్చిమాసియా నుంచి.. 35 శాతం రష్యా నుంచి, 6 శాతం యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చినవే.

