వృద్ధుల జనాభా పెరగడంతో రిటైర్మెంట్ వయసు పెంపు!

వృద్ధుల జనాభా పెరగడంతో రిటైర్మెంట్ వయసు పెంపు!
  • 2035 నాటికి వృద్ధుల జనాభా 40 కోట్లకు చేరొచ్చని అంచనా

హాంకాంగ్: చైనాలో వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతోంది.  దీంతో విడతల వారీగా రిటైర్మెంట్​ ఏజ్​ను పెంచాలని  చైనా సర్కారు ప్లాన్​ చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు చైనా మానవ వనరుల శాఖ పరిశీలనలో ఉన్నాయంటూ  ఆ దేశ అధికారిక మీడియా సంస్థ ‘గ్లోబల్​ టైమ్స్’ కథనాన్ని ప్రచురించింది. రిటైర్మెంట్ సంస్కరణల్లో భాగంగా తొలి విడతగా పదవీ విరమణ (రిటైర్మెంట్)​ వయసును కొన్ని నెలల పాటు పెంచుతారని తెలుస్తోంది. ఉద్యోగులు లేదా కార్మికుల  ఆరోగ్య స్థితిగతులు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా రిటైర్మెంట్​ తేదీని ముందుకు, వెనక్కు  మార్చుకునే వెసులుబాటును కూడా కల్పించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం చైనాలో పురుషుల రిటైర్మెంట్ ఏజ్​60 ఏళ్లు.  వైట్​ కాలర్​ జాబ్స్​ చేసే మహిళల రిటైర్మెంట్​ ఏజ్ 55 ఏళ్లు, ఫ్యాక్టరీల్లో పనిచేసే మహిళల రిటైర్మెంట్ ఏజ్​ 50 ఏళ్లు. పదవీ విరమణ వయసుకు సంబంధించిన సంస్కరణలపై తమ ప్రభుత్వం లోతైన అధ్యయనం చేశాక ఒక పాలసీని ప్రకటిస్తుందని చైనా కొత్త ప్రధాని లీ క్వియాంగ్ వెల్లడించారు. ​ 

పెన్షన్​ బడ్జెట్​లో తీవ్ర లోటుతో సతమతం

చైనాలో 60 ఏళ్లు పైబడిన వారు దాదాపు 28 కోట్ల మంది ఉన్నారు. ఈ సంఖ్య 2035కల్లా 40 కోట్లకు పెరగొచ్చని చైనా సర్కారు అంచనావేస్తోంది. అంటే ఏటా రిటైర్​ అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. దీనివల్ల వారికి చేయాల్సిన పెన్షన్ పేమెంట్స్​కు పెద్ద మొత్తంలో బడ్జెట్​ను ప్రభుత్వం కేటాయించాల్సి వస్తుంది. రిటైర్మెంట్ ఏజ్​ను క్రమంగా పెంచడం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ఈ ఒత్తిడి కొంతమేర తగ్గించుకోవచ్చని చైనా సర్కారు భావిస్తోంది. ‘యాక్టివ్​వర్కర్స్, ఎంప్లాయీస్​ సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. రిటైర్​ అయ్యేవాళ్ల సంఖ్య మాత్రం పెరుగుతోంది. దీనివల్ల ఇప్పటికే చైనాలోని 31 ప్రావిన్స్​లు పెన్షన్ బడ్జెట్​ కు సంబంధించిన తీవ్ర లోటును ఎదుర్కొంటున్నాయి. 2035 నాటికి పెన్షన్​ విభాగాల గల్లా పెట్టెలన్నీ ఖాళీ అయ్యే చాన్స్​ ఉంది’ అని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.