పేదలకు న్యాయం చేయాల్సిన వ్యవస్థలు పతనమయ్యాయి

పేదలకు న్యాయం చేయాల్సిన వ్యవస్థలు పతనమయ్యాయి

భూ సమస్యల  పరిష్కారానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కొందరు రైతులకు శాపంగా మారింది. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కలెక్టరేట్ల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. బాధితుల పక్షాన నిలవాల్సిన అధికారం దుర్మార్గులకు కొమ్ముకాస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంగ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనలో అందమైన కలెక్టరేట్లు కట్టారు కానీ.. అక్కడ పేదలకు న్యాయం చేయాల్సిన వ్యవస్థలు పతనమయ్యాయని ఆరోపించారు. బాధితులు అర్జీలకు బదులు పెట్రోల్ సీసాలతో కలెక్టరేట్ల కార్యాలయాలకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ధరణి పోర్టల్ వచ్చినా భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో బాధితులు ఎప్పట్లాగే  ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లలో జరిగే ప్రజావాణికి క్యూ కట్టారు. కలెక్టర్లకు అర్జీలు పెట్టుకొని నెలలు గడుస్తున్నా స్పందన లేకపోవడంతో గత్యంతరం లేక కలెక్టరేట్లలోనే ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. సోమవారం సూర్యాపేట, జనగామ, గద్వాల కలెక్టరేట్లలో నలుగురు బాధితులు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. ఆఫీసర్లు, పోలీసులు అడ్డుకున్నారు. నెలల తరబడి ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని, అలాంటప్పుడు ఈ ప్రజావాణి ఎందుకని బాధితులు ప్రశ్నించారు.  రెవెన్యూ ఆఫీసర్లు తమ భూములను ఇతరులకు అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ ఓ యువరైతు జనగామ కలెక్టరేట్ బిల్డింగ్ పైకి ఎక్కి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. 

తమ భూములను తిరిగి తమ పేరిట పట్టా చేయాలని, లేకపోతే నిప్పంటించుకుని చనిపోతానని హెచ్చరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో న్యాయం చేస్తామని ఆర్డీఓ మధుమోహన్ హామీ ఇవ్వడంతో బిల్డింగ్ పై నుంచి రైతు దిగివచ్చాడు. బాధితుడి కథనం ప్రకారం.. జనగామ మండలం పసరమడ్లకు చెందిన నిమ్మల నర్సింగరావుకు 7.29 ఎకరాలు, నిమ్మల లక్ష్మయ్యకు 7.20 ఎకరాల భూమి వంశపారంపర్యంగా వచ్చింది. గతంలోనే వీరు ఇతర ప్రాంతాలకు వలస పోగా.. వీరి భూములను దాయాదులు అక్రమంగా పట్టా చేయించుకున్నారు. తమకు న్యాయం చేయాలని నిరుడు డిసెంబర్​లోనూ కలెక్టరేట్ వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా న్యాయం చేస్తామని ఆఫీసర్లు హామీ ఇచ్చారని, కానీ నేటి వరకూ పరిష్కరించలేదని బాధితుడు నర్సింగరావు చెప్పాడు. మరోవైపు వీఆర్ఓ ఫోన్​ చేసి భూమి మీద అడుగు పెట్టగలుగుతవా? అని బెదిరిస్తున్నడని ఆవేదన వ్యక్తం చేశాడు. 

కొందరు తమ భూమిని ఆక్రమించుకున్నారని ఫిర్యాదు చేస్తే పోలీసులు కబ్జాదారులతో కుమ్మక్కై తమపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఓ మహిళా రైతు, మరో యువరైతు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. సాదా బైనామాలకు సర్కారు పట్టాలివ్వకపోవడం వల్ల తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమి పోతోందనే ఆవేదనతో మరో యువ రైతు గద్వాల కలెక్టరేట్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు పెట్రోల్ డబ్బా లాక్కొని నీళ్లు పోయడంతో ప్రమాదం తప్పింది.