హైదరాబాద్లో గత వారం రోజులుగా వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ట్వీట్టర్ వేదికగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘‘సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ వర్షాల నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు. పుట్టిన రోజు మోజులో పడి కేటీఆర్ జనాలను మరిచిపోయిండు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం సమీక్ష చేయడం లేదు. తీవ్ర వర్షాల నేపథ్యంలో రాష్ర్టంలో ఇప్పటికే వాతావరణ శాఖ అలెర్ట్ ప్రకటించింది. అయిన కూడా ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు.
ట్రాఫిక్ కారణంగా గంటల తరబడి ప్రజలు రోడ్లపైనే ఉంటున్నారు. హైదరాబాద్ని డల్లాస్, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్, కేటీఆర్ లు నగరాన్ని నరక కూపంగా మార్చారు’’ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రజలకు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారికి మేలు జరిగేలా చూడాలన్నారు. బుధ, గురు వారాల్లో ప్రభుత్వం జనాలకు సరైన సేవలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేకపోతే శుక్రవారం నాడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం అని ఆయన హెచ్చరించారు.