పది లక్షల మందితో సెప్టెంబర్ 17న సభ: రేవంత్ రెడ్డి

 పది లక్షల మందితో సెప్టెంబర్ 17న సభ: రేవంత్ రెడ్డి
  • అక్కడే సభ పెడ్తామని కిషన్​రెడ్డి చెప్పడమేంది? 
  • రెండో ఆప్షన్​గా ఎల్బీ  స్టేడియం కోసం అప్లయ్​ చేసినట్లు వెల్లడి
  • సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణపై చర్చించిన పీసీసీ

హైదరాబాద్​, వెలుగు: పది లక్షల మందితో ఈ నెల 17న సభ నిర్వహిస్తామని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి తెలిపారు. సభను కాంగ్రెస్​ నేతలంతా విజయవంతం చేయాలని ఆయన కోరారు. సీడబ్ల్యూసీ మీటింగ్స్​ నిర్వహణపై మంగళవారం గాంధీభవన్​లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్​ మాట్లాడుతూ.. పరేడ్​ గ్రౌండ్​ను కాంగ్రెస్​ సభకు ఇవ్వకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. ‘‘పరేడ్​ గ్రౌండ్​లో సభ కోసం సెప్టెంబర్​ 2న రక్షణ శాఖకు లేఖ రాసినం. కానీ, పరేడ్​ గ్రౌండ్​ ఇవ్వకుండా బీజేపీ, బీఆర్​ఎస్​ కలిసి కుట్ర పన్నుతున్నయ్​. ఆ గ్రౌండ్​లో బీజేపీ సభ పెడ్తమని కిషన్​ రెడ్డి చెప్పడమే అందుకు నిదర్శనం” అని మండిపడ్డారు. 

ఎస్పీజీ భద్రత ఉన్న నేతలు వచ్చినప్పుడు ప్రభుత్వం విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలని అన్నారు. రెండో ఆప్షన్​గా ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించేందుకు అనుమతినివ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు. ఔటర్​ బయట కూడా సభను నిర్వహించుకునేలా కార్యాచరణ తీసుకోవాలని నేతలకు ఆయన సూచించారు. 

7న భారత్​ జోడో యాత్ర ఉత్సవాలు

దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదపుటంచుకు బీజేపీ నెట్టిందని రేవంత్​ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో తొలిసారిగా సీడబ్ల్యూసీ సమావేశాలను కాం గ్రెస్​ హైకమాండ్​ నిర్వహిస్తున్నదని, ఈ సమావేశాలను ప్రతి కార్యకర్త విజయవంతం చేయాలని అన్నారు. ‘‘సెప్టెంబర్​ 17న ఐదు గ్యారెంటీలను ప్రకటించాల్సిందిగా సోనియా గాంధీకి విజ్ఞప్తి చేసినం. మా విజ్ఞప్తిని మన్నించి ఇక్కడ సమావేశాలు పెట్టినందుకు ధన్యవాదాలు” అని చెప్పారు. సీడబ్ల్యూసీ మీటింగ్స్​ ఏర్పాట్లు, నిర్వహణపై ఏఐసీసీ జనరల్​ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​ బుధవారం సమీక్ష నిర్వహిస్తారని రేవంత్​ తెలిపారు. ఈ నెల 17న సాయంత్రం 4 గంటలకు జరిగే సభలో సోనియా 5 గ్యారంటీలను ప్రకటిస్తారని, ఈ సభ ద్వా రా దేశానికి కాంగ్రెస్​ గొప్ప సందేశాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ‘‘గత ఏడాది సెప్టెంబర్ 7న రాహుల్ భారత్​ జోడో యాత్ర చేపట్టారు. ఈ నెల 7తో జోడో యాత్రకు ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో  ఆ రోజు మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో పాదయాత్రలు నిర్వహించి ఉత్సవాలు జరపాలి” అని నేతలకు ఆయన సూచించారు. 

17న రాత్రి నియోజకవర్గాల్లో అగ్రనేతల బస: ఠాక్రే

తెలంగాణలో సీడబ్ల్యూసీ సమావేశాలను నిర్వహించడాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కాంగ్రెస్​ నేతలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్​ రావు ఠాక్రే సూచించారు. త్వరలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికలున్నప్పటికీ తెలంగాణలో సమావేశాలు పెట్టడం మన అదృష్టంగా భావించాలని చెప్పారు.  సీడబ్ల్యూసీ సమావేశాలు, బహిరంగ సభతో పాటు దేశంలోని కాంగ్రెస్​ అగ్ర నాయకులు 17న రాత్రి నియోజకవర్గాలకు వెళ్లి అక్కడే నిద్రించి మరుసటి రోజు సభల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. వైఎస్ రాజ శేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ ఏఐసీసీ, సీడబ్ల్యూసీ ప్లీనరీలను నిర్వహించారని సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు దామోదర రాజనర్సింహ అన్నారు. అప్పటి అనుభవాలను ఉపయోగించుకొని ఇప్పుడు కూడా ఈ సమావేశాలను విజయవంతం చేయాలని సూచించారు.

ఖర్చంతా ఇన్​చార్జులదే..

సెప్టెంబర్​ 17న కాంగ్రెస్​ పార్టీ పరేడ్​ గ్రౌండ్​ లో తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం పేరిట సభను నిర్వహించాలనుకున్నది. అయితే.. అదే గ్రౌండ్​లో అదే రోజు బీజేపీ కూడా సభను నిర్వహించాలనుకుంటుండడంతో పరేడ్​ గ్రౌండ్​ నుంచి వేరే చోటుకు సభా వేదికను మార్చాలని కాంగ్రెస్​ పార్టీ నిర్ణయించింది. తొలి ఆప్షన్​గా ఎల్బీ స్టేడియాన్ని పెట్టుకుంది. అది కుదరకపోతే రెండో ఆప్షన్​గా కొంగర్​ కలాన్​లో నిర్వహించేందుకు ప్లాన్​ చేస్తున్నది. సభకు అన్ని జిల్లాలు, నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణను చేపట్టనుంది. ఆ బాధ్యతలను జిల్లా ఇన్​చార్జులు, ఎమ్మెల్యేలకు అప్పగించినట్టు తెలిసింది. 

అందుకు అయ్యే ఖర్చును కూడా వారే భరించాల్సిందిగా స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల వేళ నేతలకు పార్టీ ఈ టాస్క్​ను ఇవ్వడంతో పలువురు నేతలు.. తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల ఖర్చును పెట్టుకుని.. ఈ సభ కోసం జన సమీకరణకు అయ్యే ఖర్చును కూడా పెట్టుకోవడమంటే తలకు మించిన భారంగా ఆయా నేతలు భావిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు పది లక్షల మందిని సభకు తరలించాల్సిందిగా పెట్టిన టార్గెట్​పైనా పలువురు నేతలు పెదవి విరుస్తున్నారు.