- దేశానికి గాంధీ కుటుంబమెట్లనో.. తెలంగాణకు కాకా వెంకటస్వామి కుటుంబమూ అంతే
- తాను, భట్టి విక్రమార్క అనేక సార్లు వివేక్ను కలిసి పార్టీలోకి రావాలని కోరినట్లు వెల్లడి
- కేసీఆర్ను గద్దె దించేందుకు కలిసికట్టుగా పోరాడుతాం: వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, వెలుగు: మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి చేరికతో కాంగ్రెస్ పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘వివేక్ చేరికతో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమైంది. ఆయన కుటుంబం, గాంధీ ఫ్యామిలీ మధ్య మూడు తరాల బంధం ఉంది. దేశానికి గాంధీ కుటుంబం ఎట్లనో.. తెలంగాణకు కాకా వెంకటస్వామి కుటుంబం కూడా అంత ముఖ్యం” అని తెలిపారు. రాహుల్ సమక్షంలో వివేక్ వెంకటస్వామి, ఆయన కుమారుడు వంశీకృష్ణ కాంగ్రెస్ లో చేరిన అనంతరం నోవాటెల్ వద్ద వివేక్తో కలిసి రేవంత్ మీడియాతో మాట్లాడారు.
రాహుల్గాంధీ పలుమార్లు వివేక్తో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారని రేవంత్ అన్నారు. ‘‘నేను, మాణిక్రావ్ ఠాక్రే, కేసీ వేణుగోపాల్, భట్టి విక్రమార్క కూడా పలు మార్లు వివేక్ను కలిసి పార్టీలోకి రావాల్సిందిగా కోరాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ను గద్దె దించాలంటే కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పాం. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి మీ సహకారం ఉందని ఆయనకు విజ్ఞప్తి చేసినం. కేసీఆర్ను గద్దె దించేది కాంగ్రెస్ పార్టీనే అని నమ్మి పార్టీలో వివేక్ చేరారు” అని పేర్కొన్నారు. కాంగ్రెస్లో వివేక్ చేరిక తెలంగాణ ప్రజలకు అన్నిరకాలుగా ఉపయోగపడుతుందని, నాలుగు కోట్ల మంది ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. ‘‘ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో వివేక్ వెంకటస్వామికి ఎంతో అనుబంధం ఉంది. గాంధీ కుటుంబంతో ఆయనది విడదీయలేని బంధం. ఇప్పుడు సొంత కుటుంబంలోకి వచ్చారు. ఆయనకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఆనాడు తెలంగాణ కోసం ఎంపీలంతా దేనికోసమైతే పోరాడారో.. ఆ కల తీరే సమయం ఆసన్నమైంది. వివేక్ చేరికతో ‘మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి’ అన్న ఆలోచన మరింత బలపడింది” అని రేవంత్ పేర్కొన్నారు.
రాక్షస పాలనను అంతం చేసే దాకా ఉద్యమం: వివేక్
కేసీఆర్ను గద్దె దించేందుకు కలిసికట్టుగా పోరాడుతామని, రాక్షస పాలనను అంతమొందించేవరకు ఉద్యమం నడుస్తూనే ఉంటుందని వివేక్ వెంకటస్వామి చెప్పారు. తెలంగాణ కోసం ఉద్యమం సమయంలో ఆనాడు కాంగ్రెస్ ఎంపీలమంతా కలిసికట్టుగా కొట్లాడామని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను గుర్తించి సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ‘‘తెలంగాణ ఏర్పడితే ప్రజలు, రాష్ట్రం బాగుపడుతుందని సోనియాగాంధీ ఆశించారు. కానీ, ఈ తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరి ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరలేదు. బీఆర్ఎస్, కేసీఆర్ ప్రభుత్వం కేవలం కల్వకుంట్ల కుటుంబం కోసమే పనిచేస్తున్నాయి. ప్రజల మేలు కోసం పాటుపడడం లేదు. కేసీఆర్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఎవరికీ ఏమీ చేయలేదు” అని పేర్కొన్నారు. కేసీఆర్ను గద్దె దించడమే తమ లక్ష్యమని, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారమే నడుచుకుంటానని చెప్పారు.