
కామారెడ్డిని దోచుకోవడానికి కేసీఆర్ వస్తుండని.. ఆ దొంగను వేటాడేందుకే తాను వచ్చానని చెప్పారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కామారెడ్డిలో భూములను కాపాడే బాధ్యత తనదే అన్నారు రేవంత్ . కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. రెడ్డిపేటలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తో కేసీఆర్ భూములు కాజేయాలని చూశారని చెప్పారు. భూములు కాజేసేందుకే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తుండని.. కేసీఆర్ ను రాణివ్వకుండా తరిమి కొట్టాలని చెప్పారు.
కేసీఆర్ కు ఓటేస్తే నిరుద్యోగికి చేటని యువతే చెబుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మళ్లీ వస్తే ..నిరుద్యోగులకు చేటన్నారు. ఇంత మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ ఒక్కరినైనా పరామర్శించారా? అని నిలదీశారు. రాష్ట్రమొస్తే కొల్వులొస్తాయని యువత కలలు కన్నారని..ఉద్యోగాలు రాక యువకులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ బాధిత కుటుంబాన్నైనా కేసీఆర్ పరామర్శించారా? అని ప్రశ్నించారు. పేపర్ లీక్ తో పరీక్షా పత్రాలు జీరాక్స్ సెంటర్లో దొరికాయన్నారు. కేసీఆర్ ఉద్యోగాన్ని ఊడగొట్టేందుకే కామారెడ్డి వచ్చానని.. కేసీఆర్ ఉన్నంత వరకు యువకులకు ఉద్యోగాలు రావన్నారు రేవంత్.