సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే.. కేసీఆర్ ఫ్యామిలీ అడుక్కునేది : రేవంత్ రెడ్డి

సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే.. కేసీఆర్ ఫ్యామిలీ అడుక్కునేది : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోయి ఉంటే.. కేసీఆర్ ఫ్యామిలీ అడుక్కు తినేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన కేసీఆర్.. తెలంగాణ ప్రజలను కూడా దోచుకుతిన్నారంటూ విమర్శలు చేశారాయన. నవంబర్ 16వ తేదీ మేడ్చల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. కేసీఆర్ ఫ్యామిలీకి వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

జన్వాడలో మంత్రి కేటీఆర్ కు వంద ఎకరాల్లో ఫాంహౌస్ ఉందని.. గజ్వేల్ లో కేసీఆర్ కు వేల కోట్ల రూపాయల ఫాంహౌస్ ఉందని.. ఇవన్నీ ఎలా వచ్చాయని నిలదీశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 22 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారని.. ఒక్క రూపాయి అయినా పేదలకు ఇచ్చారా అని నిలదీశారు రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు ఇంటి జాగాతోపాటు 5 లక్షల డబ్బులు ఇస్తామని.. ప్రతి పేద ఇంటికి ఉచిత కరెంట్ ఇస్తామని.. ప్రతి మహిళ ఖాతాలో ప్రతినెలా 2 వేల 500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారాయన. తెలంగాణాలో ప్రజా పాలన రావాలి.. దొరల రాజ్యం పోవాలంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని కేసీఆర్ అంటున్నాడని.. హైదరాబాద్ మెట్రో, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టు, ఫార్మా కంపెనీలు, ఫ్లైఓవర్లు, ఐటీ.. ఇవన్నీ తెచ్చింది.. వచ్చింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అన్నారు రేవంత్ రెడ్డి.

మార్పు రావాలి.. కాంగ్రెస్ రావాలి.. బై బై కేసీఆర్ అంటూ ప్రజలతో నినాదాలు చేయించారు రేవంత్ రెడ్డి. పార్టీ ఇచ్చిన గ్యారెంటీలకు కట్టుబడి ఉన్నామని.. అన్ని హామీలను అమలు చేసి తీరతామని భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి.