ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేట్ వ్యక్తులకు లీజు వెనుక భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఔటర్ రింగు రోడ్డును 30 ఏళ్ల పాటు లీజుకిస్తే దాదాపు 30 వేల కోట్ల ఆదాయం వస్తదన్నారు. అయితే ముంబైకి చెందిన ఐఆర్ బీ లిమిటెడ్ అనే సంస్థకు 7380 కోట్లకే కేసీఆర్ తాకట్టు పెట్టారని ఆరోపించారు. నాలుగైదు నెలల్లో దిగిపోయే కేసీఆర్ కు ఔటర్ రింగ్ రోడ్డును అమ్మాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
ఔటర్ రింగ్ రోడ్డు లీజులో దాదాపు 1000 కోట్లకుపైగా చేతులు మారినట్లు సమాచారం ఉందన్నారు రేవంత్. ఇది దేశంలోనే పెద్ద స్కాం అని.. దీని వెనకాల మాజీ సీఎస్ సోమేష్ కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ ఉన్నారని ఆరోపించారు. కేటీఆర్ తో కలిసి ఈ దోపిడికి పాల్పడ్డారన్నారు. సోమేశ్ కుమార్, అర్వింద్ కుమార్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు రేవంత్. ఈ ఇద్దరు అధికారులు తీసుకున్న నిర్ణయాలను.. లావాదేవీలపై అధికారంలోకి రాగానే కాంగ్రెస్ సమీక్షిస్తుందన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన స్కాంపై తాము అధికారంలోకి రాగానే విచారణ జరుపుతామన్నారు రేవంత్. దోపిడి కోసమే కేసీఆర్ ఔటర్ రింగ్ రోడ్డును ఐఆర్అండ్ బీ సంస్థకు కేసీఆర్ కట్టబెట్టిండని ఆరోపించారు. నాలుగైదు నెలల్లో గద్దె దిగే కేసీఆర్ కు ఔటర్ రింగ్ రోడ్డును లీజుకు ఇవ్వాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్డును లీజుకివ్వడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని.. ఈ ఒప్పందాలన్నింటిని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సమీక్షిస్తుందన్నారు. ఈ టెండర్ల వెనుక జరిగిన అవకతవకలపై అన్ని దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తమని వెల్లడించారు.
సంస్థ యాజమానులు కూడా నూటికి నూరు శాతం జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. ప్రజల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడితే బీజేపీ ఎందుకు స్పందించడం లేదన్నారు రేవంత్. ఔటర్ రింగ్ రోడ్డును కాపాడే బాధ్యత బీజేపీపైన లేదా అని ప్రశ్నించారు.