- సీఎంవన్నీ కథలే..సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు
- ఆయన మాటలు చిత్తు కాగితాలతో సమానం
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని కేసీఆర్ అంటున్నట్లు వస్తున్న వార్తల్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్కు జనం వీఆర్ఎస్ ఇచ్చే రోజులు వచ్చాయని, జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ను పెద్ద జోకర్గా చూస్తున్నారని పేర్కొన్నారు. గాంధీభవన్లో శనివారం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్వన్నీ కథలే. టీఆర్ఎస్ పేరు మీదనైనా దేశంలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంది.. బీఆర్ఎస్ పేరు మీద ఎక్కడ పోటీ చేస్తరు? ఏపీలోని నెల్లూరులో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది.. అక్కడ కేసీఆర్ పోటీకి దిగుతరా?” అని ప్రశ్నించారు. కేసీఆర్ మాటలు చిత్తుకాగితాలతో సమానమన్నారు. ‘‘బీఆర్ఎస్ని ముందుకు తెస్తున్నారంటే, టీఆర్ఎస్కు కాలం చెల్లిందని అనుకోవాలా? కేసీఆర్ మెడిసిన్కు కాలం చెల్లిపోయింది. అది ఇంకా తెలంగాణలో పని చేయదు” అని పేర్కొన్నారు.
రేపు ఈడీ ఆఫీస్ ముందు నిరసన
రాహుల్ గాంధీ సోమవారం ఢిల్లీలో ఈడీ ముందు హాజరవుతున్నందున గాంధీభవన్లో శనివారం ఉదయం ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం అన్ని రాష్ట్రాల్లో ఈడీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ అంశంపై రేవంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమీక్ష జరిపారు. ఉదయం 10 గంటలకు నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లి రాహుల్ విచారణ ముగిసే వరకు అక్కడే నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించినట్లు రేవంత్ తెలిపారు.
కేసీఆర్, అసద్ ఎందుకు స్పందించరు?
రాష్ట్రంలో 15 రోజుల్లో ఎనిమిది రేప్లు జరిగాయని, మైనర్లపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్తులను శిక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని, పైగా సర్కారే నేరాలకు పాల్పడుతున్నదని రేవంత్ మండిపడ్డారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతున్నా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమని అన్నారు. అసదుద్దీన్ కూడా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. దీన్ని బట్టి టీఆర్ఎస్, ఎంఐఎంలు పొత్తులు పొట్టుకొనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని
రేవంత్ రెడ్డి ఆరోపించారు.
బస్సు చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలె
విద్యార్థుల మంత్లీ బస్ పాస్ చార్జీలను రూ.195 నుంచి రూ.450కి పెంచడంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది విద్యార్థుల పాలిట పిడుగుపాటు అని మండిపడ్డారు. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం పేద, మధ్య తరగతి వర్గాలకు భారంగా మారుతుందని అన్నారు. ఊహించని స్థాయిలో పెరిగిన ఛార్జీలు.. విద్యార్థులను చదువుకు దూరం చేసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ఆర్టీసీ వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.