
- ఈ విద్యాసంవత్సరం నుంచే అడ్మిషన్లు
- ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
హైదరాబాద్, వెలుగు: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ బాసర)కు అనుబంధంగా మహబూబ్ నగర్లో కొత్తగా క్యాంపస్ పెట్టేందుకు సర్కారు ఆమోద ముద్ర వేసింది. ఈ విద్యాసంవత్సరం(2025–26) నుంచే మహబూబ్ నగర్లో అడ్మిషన్లు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.
ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా జీవో రిలీజ్ చేశారు. ఈ క్యాంపస్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్– ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (సీఎస్ఈ– ఏఐఎంఎల్), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (డేటా సైన్స్) కోర్సులకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
ఈ ఏడాది పీయూసీలో 180 మందికి అడ్మిషన్లు కల్పించనున్నారు. దీనికి అనుగుణంగా ఆర్జీయూకేటీ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే, ఈ నెల మొదటి వారంలో ఆర్జీయూకేటీ క్యాంపస్ కోసం ప్రస్తుతం ఆ వర్సిటీ వీసీ గోవర్దన్, జేఎన్టీయూ మాజీ రిజిస్ర్టార్ మంజూరు హుస్సేన్ తదితరులు మహబూబ్ నగర్ లో పర్యటించి, స్థలాన్ని పరిశీలించారు.
43 ఎకరాల స్థలాన్ని గుర్తించి, అక్కడ ఏర్పాటు చేసేందుకు కమిటీ సుముఖం వ్యక్తం చేస్తూ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కు రిపోర్టు ఇచ్చారు. దీనికి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం భవనాల నిర్మాణం జరగకపోవడంతో, అద్దె భవనంలో ఈ ఏడాది క్లాసులు ప్రారంభించాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు.