TGSRTC బంపర్ ఆఫర్.. ఆర్టీసీ బస్సెక్కండి.. రూ.5.50 లక్షల బహుమతులు గెలుచుకోండి

TGSRTC  బంపర్ ఆఫర్.. ఆర్టీసీ బస్సెక్కండి.. రూ.5.50 లక్షల బహుమతులు గెలుచుకోండి

హైదరాబాద్: ఆర్టీసీ ప్రయాణికులకు టీజీఎస్​ఆర్టీసీ బంపర్​ఆఫర్.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి బహుమతులు ఇస్తామని టీజీఎస్​ఆర్టీసీ ప్రకటించింది. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి లక్కీ డ్రా నిర్వహించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో రీజియన్ కి ముగ్గురు చొప్పున 33 మందికి రూ.5.50 లక్షల విలువగల బహుమతులను సంస్థ అందజేయనుంది.  ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలను సంస్థ ప్రకటించింది. 

సెప్టెంబర్​ 27 నుంచి అక్టోబర్ 6వరకు టీజీఎస్ఆర్టీసీకి చెందిన హైఎండ్ బస్సులైన సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్, డీలక్స్, సూపర్ లగ్జరీ, లహారి నాన్ ఏసీతో పాటు అన్ని రకాల ఏసీ బస్సుల్లో ప్రయాణించిన వారే అర్హులని తెలిపింది.  బస్సు ప్రయాణం అనంతరం టికెట్టు వెనకాల పేరు, ఫోన్​ నంబర్​ రాసి బస్టాండులో ఏర్పాటు చేసిన లక్కీ డ్రా బాక్సులో వేయాలని సూచించింది.  

అక్టోబరు 6 తర్వాత డ్రాప్ బాక్స్ లను సంబంధిత ఆర్ఎం కార్యాలయాలకు చేర్చి ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా తీస్తారు. అక్టోబర్ 8న  ప్రతి రీజియన్​ నుంచి ముగ్గురి చొప్పున విజేతలను ప్రకటిస్తారు.  

లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి నగదు బహుమతితో పాటు సంస్థ ఘనంగా సన్మానిస్తుందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు.  దసరా లక్కీ డ్రాలో ప్రయాణికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033 తో పాటు స్థానిక డిపో మేనేజర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.

►ALSO READ | ముస్తాబైన బతుకమ్మ కుంట..సెప్టెంబర్26న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

మరోవైపు దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ఆర్టీసీ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికుల సౌకర్యార్థం 7754 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని సజ్జనార్​ చెప్పారు. ప్రయాణికుల రద్దీనిబట్టి మరిన్నీ ప్రత్యేక బస్సులను నడపాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు.