బిజినెస్ డెస్క్, వెలుగు: ఒక వైపు క్రూడాయిల్, మరోవైపు ఎడిబుల్ ఆయిల్ ( వంట నూనె) ధరలు పెరుగుతుండడం ప్రభుత్వాన్ని, ఆర్బీఐని చిక్కుల్లో పడేస్తోంది. ఇన్ఫ్లేషన్ను కట్టడి చేయడంలో ఇబ్బందిగా మారుతోంది. గ్లోబల్గా ఆయిల్ ధరలు ఏడేళ్ల గరిష్టాన్ని తాకిన విషయం తెలిసిందే. రామెటీరియల్స్ ధరలు పెరగడం చూశాం. ప్రస్తుతం వీటన్నింటి కంటే ఆహార పదార్ధాల ధరలు రికార్డ్ లెవెల్స్కు చేరుకోవడం కలవర పెడుతోంది. వంట నూనెల ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణం. పామ్ ఆయిల్ రేట్లు ఈ ఏడాదిలో 15 శాతం పెరిగాయి. సోయాబిన్ ఆయిల్ ధరలు 12 శాతం ఎగిశాయి. సన్ఫ్లవర్ ఆయిల్, ఆవాల నూనె రేట్లు కూడా చుక్కలంటుతున్నాయి. ఇలా వంట నూనె ధరలు పెరగడంతో ఆహారదార్ధాల ఇన్ఫ్లేషన్ మిగిలిన సెగ్మెంట్ల కంటే ఎక్కువగా ఉంది. పామ్ ఆయిల్, సోయాబిన్, సన్ ఫ్లవర్ ఆయిల్స్ కోసం ఇంపోర్ట్స్పై ఎక్కువగా ఆధారపడుతున్నాం. గ్లోబల్గా వీటి రేట్లు పెరగడంతో దేశంలోని వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది.
వంట నూనె రేట్లు తగ్గించే పనిలో..
వంట నూనె రేట్లను తగ్గించడానికి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలను తీసుకొంది. పామ్ ఆయిల్, సోయాబిన్, సన్ఫ్లవర్ ఆయిల్స్పై ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించింది. సోయాబిన్ వంటి కమోడిటీల ఫ్యూచర్స్పై బ్యాన్ వేసింది. అయినప్పటికీ వంట నూనెల ధరలు దిగిరావడం లేదు. దీనికి కారణం డిమాండ్ను ప్రభుత్వం తక్కువగా అంచనావేయడమేనని ఎనలిస్టులు చెబుతున్నారు. సమీప భవిష్యత్లో వంట నూనెల రేట్లను కట్టడి చేయడానికి ప్రభుత్వం తీసుకోగలిగే చర్యలు పరిమితంగా ఉన్నాయని గోద్రేజ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డోరబ్ మిస్త్రీ అన్నారు. ఇంపోర్ట్ డ్యూటీని మరింత తగ్గించినా, ఆ ప్రభావం పెద్దగా కనిపించదని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రిఫైన్డ్ పామ్ ఆయిల్ను దిగుమతి చేసుకొని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (రేషన్ షాపుల) ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువకే అమ్మాలని సలహాయిచ్చారు. మీడియం నుంచి లాంగ్ టెర్మ్లో వంట నూనెల దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. ఇందుకోసం వంట నూనెల నిల్వలను పెంచుకోవడం, లోకల్గానే ఆవాలు, సన్ఫ్లవర్, సోయాబిన్, పామ్ పంటల విస్తీర్ణాన్ని పెంచడం, నూనె గింజల ప్రొడక్షన్ను పెంచడానికి కమర్షియల్ కల్టివేషన్కి అనుమతివ్వడం వంటి ఆప్షన్లను ప్రభుత్వం చూడాలని నిపుణులు సలహాయిస్తున్నారు.
వంటనూనెల రిజర్వ్లను పెంచాలని, అప్పుడే పెరుగుతున్న ధరలను కట్టడి చేయగలుగుతుందని అన్నారు. ప్రస్తుతం ధాన్యం, గోధుమలను ప్రభుత్వం ఎక్కువగా నిల్వ చేస్తోంది. వీటికి బదులుగా వంట నూనెల నిల్వలపై ఫోకస్ పెంచాలని, నూనె గింజలను పండించే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిపుణులు సలహాయిస్తున్నారు..
రేట్ల పెంపు ఉంటుందా?
ఇన్ఫ్లేషన్ పెరుగుతుండడంతో యూఎస్ ఫెడ్తో సహా వివిధ సెంట్రల్ బ్యాంకులు కీలక రేట్లను పెంచాలని చూస్తున్నాయి. ఆర్బీఐ కూడా అదే బాట పట్టొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. రెపో రేటును అలానే కొనసాగించి, రివర్స్ రెపో రేటును 20 బేసిస్ పాయింట్లను పెంచాలని ఆర్బీఐ చూస్తోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. రివర్స్ రెపో రేటు అంటే బ్యాంకుల తమ ఫండ్స్ను ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేసినందుకు ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేటు. ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే ఫండ్స్పై వసూలు చేసే వడ్డీ రేటును రెపో రేటు అంటారు. ప్రస్తుతం రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా, రెపో రేటు 4 శాతంగా ఉంది. వ్యవస్థలో లిక్విడిటీని తగ్గించి, ఇన్ఫ్లేషన్ను కంట్రోల్లోకి తేవడానికి కీలక రేట్లున సెంట్రల్ బ్యాంకులు పెంచుతాయి.
ఇంకో 3 నెలల వరకు నిల్వలకు ఓకే
వంట నూనె ధరలను కట్టడి చేసేందుకు తీసుకొచ్చిన స్టాక్ లిమిట్ ఆర్డర్స్ను రాష్ట్రాలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఓ నోటిఫికేషన్లో పేర్కొంది. వంట నూనె ధరలు పెరుగుతుండడంతో వంట నూనె, నూనె గింజలను నిల్వ చేసుకోవడంపై ప్రభుత్వం పరిమితులను విధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 30 వరకు ఇదే పరిమితులు కొనసాగుతాయని తాజాగా ప్రభుత్వం పేర్కొంది. వంట నూనెను అయితే రిటైలర్లు 30 క్వింటాల్ వరకు, హోల్ సేలర్లయితే 500 క్వింటాల్ వరకు నిల్వ చేసుకోవచ్చు. అదే పెద్ద పెద్ద రిటైల్ కంపెనీలు తమ అవుట్ లెట్లలో 30 క్వింటాల్ వరకు, డిపోలలో 1,000 క్వింటాల్ వరకు నిల్వచేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.