జనగామ అర్బన్, వెలుగు : ఇక్కత్ చేనేత కళాకారుల జీవనోపాధి మెరుగుపర్చడానికి పూర్తి సహకారం అందిస్తామని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. యునైటెడ్ వే హైదరాబాద్, పెర్నోడ్ రిచార్డ్ ఇండియా ఫౌండేషన్ కలిసి చేనేత మహిళా ప్రావీణ్యత శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ఎల్లంలలోని వీవర్స్ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేయగా, ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు.
జనగామలో కూడా ఇక్కత్ మార్కెటింగ్ పెరగాలన్నారు. మహిళలు మార్కెట్ లోని డిమాండ్ కి తగ్గట్టుగా కొత్త డిజైన్లను నేర్చుకొని వ్యాపార రంగంలో రాణించాలన్నారు. కార్యక్రమంలో 50 మంది ప్రీ-లూమ్, 40 మంది లూమ్, 20 మంది నేచురల్ డైయింగ్ శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు, 77 మంది వృద్ధులు, ప్రత్యేక సామర్థ్యదారులకు మోధా పెడల్ లిఫ్టింగ్ మెషిన్లు పంపిణీ చేశారు. 500 మంది చేనేత కళాకారులకు కంటి స్క్రీనింగ్ చేసి 400 మందికి కళ్లద్దాలు అందజేశారు.
సమావేశంలో పద్మశ్రీ చింతకింది మల్లేశం, యూడబ్ల్యుహెచ్ సీఈవో రేఖా శ్రీనివాసన్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేశం పల్లె, డిజైనర్ కొండా కవితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్, డీఈవో పింకేశ్కుమార్తో కలిసి ఎంఈవోలు, సీహెచ్ఎంలు, హెచ్ఎంలు, ఇతర ఆఫీసర్లకు కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా 10వ తరగతి పరీక్షల నిర్వహణ, ఉత్తమ ఫలితాల సాధన కోసం చేపట్టిన విజయోస్తు 2.0 కార్యక్రమం కింద ప్రత్యేక కార్యాచరణ చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పదవ తరగతి పరీక్షల్లో గరిష్ట ఉత్తీర్ణత సాధించడం, ఎఫ్ఎల్ఎస్ కార్యక్రమంలో గుణాత్మక అభ్యాస ప్రమాణాలు పెంపొందించడం లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని సూచించారు. జనగామ కలెక్టరేట్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన శిశు సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ రిజ్వాన్డీసీపీ రాజమహేంద్రనాయక్తో కలిసి ప్రారంభించారు. ఇక్కడ చిన్నారులు ఆడుకునేందుకు ఆట వస్తువులు ఏర్పాటుయగా, చిన్నపిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు తెలిపారు.
