- సీఎం కేసీఆర్కు ఆర్.కృష్ణయ్య ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: బీసీ బంధు స్కీంపై సీఎం కేసీఆర్ విధాన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ బంధు ఎప్పట్నుంచి అమలు చేస్తారు? బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయిస్తారు? విధివిధానాలు ఏమిటి? స్పష్టం చేయాలని కోరారు. సోమవారం హైదరాబాద్లో గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన బీసీ యువజన సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ బంధు పథకానికి సంబంధించి బీసీ నేతలతో మీటింగ్ పెడతామని చెప్పిన కేసీఆర్.. మీటింగ్ ఎప్పుడు ఉంటుందో చెప్పాలన్నారు. బీసీ జనాభా లెక్కలపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కోరారు. తర్వాత సంఘం రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా శివ కుమార్ ముదిరాజ్ను నియమించారు.
ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీస్కోవాలె
సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోంచి తొలగిస్తారా అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే 7,651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించి 21 నెలలు గడుస్తోందని, వారిని వెంటనే డ్యూటీల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీక్షా దివస్ సందర్భంగా హైదరాబాద్ ఇందిరాపార్క్లోని ధర్నా చౌక్ వద్ద ఫీల్డ్ అసిస్టెంట్లు విజ్ఞాపన దీక్ష సోమవారం నిర్వహించారు.
ఈ దీక్షకు చీఫ్ గెస్ట్గా ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం విధుల్లో నుంచి తొలగించడంతో వాళ్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె చేశామనే కారణంతో విధుల నుంచి తొలగించడం దారుణమని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షడు చింత కృపాకర్ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు సాధించుకునే వరకు పోరాడుతామని, రైతులు ఢిల్లీలో చేసినట్టుగానే దీక్షలు చేస్తామని తెలిపారు. వెంటనే విధుల్లోకి తీసుకోకుంటే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు.