కరీంనగర్ జిల్లా: గంగాధర మండలం కురిక్యాల దగ్గర టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. ప్రమాదంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కంకర లోడ్ తో వస్తున్న టిప్పర్ లారీ ఓ కారును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించి.. బస్సును ఢీకొట్టడమే కాదు… కారును ఈడ్చుకుంటూ రోడ్డు కిందకు లాక్కుపోయి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పరిస్థితి సీరియస్ గా ఉంది.
జగిత్యాల-కరీంనగర్ రోడ్డుపై .. కురిక్యాల వరద కాలువ బ్రిడ్జి దగ్గర.. అతి వేగంగా వచ్చిన టిప్పర్ లారీ… ఓ కారును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఎదురుగా వచ్చిన ఎక్స్ ప్రెస్ బస్సును ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. అప్పటికే బస్సును రోడ్డు కిందవైపుకు డ్రైవర్ తిప్పి బ్రేక్ వేశాడు. బస్సు రోడ్డు దిగి చెట్లల్లో ఆగిపోయింది.
లారీ అదుపుతప్పి.. కారుతో సహా.. రోడ్డు పక్కకు దూసుకుపోయింది. లారీ ఒక పక్కకు ఒరగడంతో… కంకర అంతా కారుపై పడింది. కారులో ఉన్న వారిని .. అద్దాలు పగలగొట్టి.. కష్టమ్మీద బయటకు లాగారు స్థానికులు.
ఈ ప్రమాదంలో.. ఓ చిన్నారి,మరో ఇద్దరికి గాయలయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



