- కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు సూచించారు. బుధవారం ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తో కలిసి నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సభ కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో ప్రతి గంటకు సగటున 55 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయని తెలిపారు.
మద్యం తాగి వాహనాలు నడపడం, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పారు. ద్విచక్రవాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్ డ్రైవర్లు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్రదర్శించిన నాటకం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీటీవో బాలు, డీఎస్పీ శ్రీనివాస్, డీఎంహెచ్వో రవినాయక్ పాల్గొన్నారు.
