మెదక్, వెలుగు: మెదక్ పట్టణ శివారు పిల్లికొటాల్లోని జర్నలిస్ట్ కాలనీలో శుక్రవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. శ్రీధర్ ఇంటి మెయిన్ డోర్ గొళ్లం విరగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. డబ్బులు, నగలు, ఇతర విలువైన వస్తువుల కోసం ఇళ్లంతా వెతికారు. సామగ్రి, బట్టలు చిందర వందర చేశారు. ఆ ఇంటి వెనకే ఉన్న బీవీకే రాజు ఇంటి డోర్ గొళ్లెం విరగొట్టి ఇంట్లో ప్రవేశించిన దొంగలు ఒక కంప్యూటర్ మానిటర్, ఏసీ విండో ఎత్తుకెళ్లారు.
కొద్ది దూరంలో మరో ఇంటి సమీపంలో పార్క్ చేసి ఉన్న రవికుమార్కి చెందిన బైక్ ఎత్తుకెళ్లారు. డబుల్ బెడ్ రూమ్ కాలనీలో మల్లాగౌడ్ అనే వ్యక్తి బైక్ సైడ్ ఫ్రేమ్లు ఎత్తుకెళ్లారు. విషయం తెలిసి ఎస్ఐ అమర్ సిబ్బందితో వచ్చి దొంగతనం జరిగిన ఇళ్లను పరిశీలించారు. చోరీకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కిరాణ డబ్బాలో చోరీకి యత్నం
శివ్వంపేట: మండల పరిధి లచ్చిరెడ్డిగూడంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి ప్రయత్నించారు. గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి నవాబుపేట-గోమారం ప్రధాన రోడ్డు పక్కన కిరాణ డబ్బా ఏర్పాటు చేసుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కిరాణ డబ్బా షటర్ తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా అదే సమయంలో అటు వైపుగా మనుషులు రావడంతో పరారయ్యారు. విషయం పోలీసులకు తెలియడంతో వచ్చి పరిశీలించారు.
