మరో మూడు రోజుల్లో పెళ్లి. ఇల్లంతా చుట్టాలతో హడావుడిగా ఉంది. ఇంతలోనే ఊహించని ఘటన. పెళ్లి కోసం తెచ్చిన నగలు, నగదు తెల్లారేసరికి మాయం. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో జరిగింది. మిడ్జిల్ మండలం బోయిన్ పల్లిలో పెళ్లింట్లోకి చొరబడ్డ దొంగలు ఈ భారీ చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన ఇంద్రారెడ్డి కొడుకు తిలక్ రెడ్డి వివాహం ఈ నెల 23న జరగనుంది. పెళ్లి కోసం బ్యాంక్ లాకర్ నుంచి నగలు తెచ్చి ఇంట్లో ఉంచారు. అంతేకాకుండా.. ఇంద్రారెడ్డి అన్న ఇళ్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉండటంతో.. వారి బంగారం కూడా ఇంద్రారెడ్డి ఇంట్లోనే దాచారు. అయితే పెళ్లి దగ్గరపడటంతో ఇంట్లో బంగారం, డబ్బులు దొరుకుతాయని భావించిన దొంగలు.. శుక్రవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో బీరువాలో దాచిన 210 తులాల నగలు, 8 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఇంట్లో వాళ్లంతా నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి దొంగలు ఇంట్లోకి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నగల విలువ విలువ దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఘనటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలిసిన వారే ఈ దొంగతనం చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
For More News..