
- క్యోటోలోని కొడైజీ బుద్ధుడి గుడిలో ఏర్పాటు
- బుద్ధిజం సూత్రాలు వల్లెవేస్తున్న ‘మైండర్’
జపాన్లోని 400 ఏళ్ల నాటి ఓ గుళ్లో ఓ పంతులు శ్లోకాలు చదువుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. పూజారి పూజ చేయడం, మంత్రాలు చదవడంలో వింతేముందని అనుకోవచ్చు. ఆ గుడిలో మంత్రాలు చదువుతోంది రోబో పంతులు మరి. క్యోటోలోని కొడైజీ బుద్ధుడి గుడిలో ఈ ఆండ్రాయిడ్ రోబో బుద్ధిజం సూత్రాలను వల్లెవేస్తోంది. యువకుడిలా కనబడుతున్న ఈ రోబో ఈ ఏడాది నుంచే పని మొదలుపెట్టింది. చేతులు, తల, మొండెంను కదిలించే ఈ రోబోకు మైండర్ అని పేరు పెట్టారు. మైండర్ చేతులు, ముఖం, భుజాలను మాత్రమే మనిషిని పోలిన చర్మంతో కవర్ చేశారు. మిగిలిన భాగాలంతా మెషీన్ మాదిరి కనబడతున్నాయి. రోబో తయారీకి సుమారు రూ.7 కోట్లు ఖర్చయింది. ఇగో, కోపం, కోరికల వల్ల కలిగే నష్టాలు, బాధల గురించి, ఇతరుల పట్ల దయ చూపాలని రోబో వివరిస్తుంటుంది. గుళ్లంటే పూజలు జరిగే ప్రాంతాలని యువకులు భావిస్తుంటారని, ఈ రోబోతో వాళ్ల ఆలోచన మారిపోతుందని అక్కడి వాళ్లు అంటున్నారు. ఈ రోబో హార్ట్ సూత్రాలను జపాన్ భాషలో పలుకుతుందని, ఇంగ్లీష్, చైనా భాషల్లోనూ ఆ సూత్రాలను స్క్రీన్పై చూపిస్తుందని చెప్పారు. మతం పవిత్రతను రోబోలతో నాశనం చేస్తున్నారన్న విమర్శలూ వస్తున్నాయి. అయితే, బుద్ధుని మార్గాన్ని మనం అనుసరించాలని బుద్ధిజం బోధిస్తుందని.. అది మెషీన్ చెప్పినా, లేక ఏ చెట్లో, ఇనుప ముక్కో చెప్పినా ఏముందని కొందరు అంటున్నారు.